Madhya Pradesh Polls: మామూలుగానే రాజకీయ నాయకుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పార్టీ టికెట్ వస్తుందో లేదో టెన్షన్, వచ్చిన తర్వాత గెలుస్తామో లేదో టెన్షన్, ఆ తర్వాత మరేదో టెన్షన్ మొత్తానికి రాజకీయ నాయకుల జీవితాలు ప్రశాంతంగా ఉండవు అని అందరికీ తెలిసిందే. అయితే అందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఒక రాజకీయ నేతకు గుండెపోటు వచ్చింది. ఆయన మరెవరో కాదు బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి ఉమా శంకర్ గుప్తా. ఆయన వయసు 71 సంవత్సరాలు. భోపాల్ సౌత్ వెస్ట్ నియోజకవర్గ నుంచి టికెట్టు ఆశించారు.
అయితే గత ఎన్నికలలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఆయన ఆరున్నర వేల ఓట్ల తేడాతో పరాజయం పాలవటంతో ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే ఉమా శంకర్ గుప్తా సామాన్య రాజకీయ నాయకుడు ఏమి కాదు, ఆయనకి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. భూపాల్ కి మేయర్ గా వ్యవహరించారు అలాగే మూడుసార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర హోం మంత్రిగా కూడా వ్యవహరించారు.
అంతటి ఘన చరిత కలిగిన తనని ఒకసారి ఓటమితో పక్కన పెట్టేసరికి ఆయన మరింత నిరాశకు గురయ్యారు. ఈ కారణం చూపించే హై కమాండ్ పార్టీ టికెట్ నిరాకరించేసరికి తీవ్ర వేదనకి గురైనట్లు సమాచారం. ఆ ఆవేదనతోనే ఆయనకి గుండెపోటు వచ్చిందని ఆ కుటుంబ సభ్యులు ఆయనని హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతం పరిస్థితి స్టేబుల్ గా ఉందని ప్రకటించారు.
అయితే దీనిపై మాట్లాడటానికి బీజేపీ అయిష్టతని చూపిస్తుంది కానీ ఆయన కోలుకున్నందుకు తమ సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసింది. హాస్పిటల్లో ఉన్న గుప్తాను కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వెళ్లి పరామర్శించారు. మరి ఇప్పుడు బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదంటే పాత నిర్ణయాన్ని కొనసాగిస్తుందో వేచి చూడాలి.