Alliance Meeting: చిలకలూరిపేట సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అరుదైన సభగా ఇది మిగిలిపోతుందనడంలో అనుమానం లేదు. ఏపీలో పొత్తు పొడిచిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సభ. ఒకే స్టేజ్ పై మోడీ, చంద్రబాబు, పవన్ కనిపించారు. అంతేకాదు.. ప్రజలకు చెప్పాల్సిందే సూటిగా చెప్పేశారు. ప్రజల స్పందన చూసి భవిష్యత్ ను అంచనా వేశారు.
బీజేపీకి పార్లమెంట్లో వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వస్తుంది. అందుకే జగన్ కేసుల దర్యాప్తు ఆలస్యం అవుతుందనే అనుమానాలు ఉన్నాయి. కానీ, అందులో నిజం లేదని ప్రధాని మోడీ తేల్చేశారు. జగన్ స్థానమేంటో స్పష్టం చేశారు. అవసరార్థం జగన్ ఆగడాలను చూసి చూడనట్టు విదిలేయవచ్చ కానీ.. ఇతర విషయాల్లో ఆయన్ని క్షమించే అవకాశమే లేదని ప్రధాని తన స్పీచ్ తో క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, వైసీపీ ఒకే గూటి పక్షులని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి కాంగ్రెస్ బద్ద శత్రువు. వైసీపీ కూడా అంతకంటే తక్కువేమీ కాదని ప్రధాని చెప్పకనే చెప్పారు. వైసీపీ మంత్రులు పోటీపడి అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్తూ రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ పాటు పడుతుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే.. ఏపీ ప్రజల కలలు నెరవేరుతాయని ఆయన చెప్పారు.
బీజేపీతో దేని కోసం పొత్తు పెట్టుకున్నారని అడుగున్న వారికి చంద్రబాబు చిలకలూరి పేట సభలో సమాధానం చెప్పారు. అమరావతిని సజీవంగా ఉంచాలంటే బీజేపీతో పొత్తు అవసరమని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆంధ్రుల కలల రాజధానిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏం సాధించామో చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి 11 జాతీయ విద్యాసంస్థలు తీసుకొచ్చినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. అంతేకాదు.. కేంద్రంలోని బీజేపీ సాయంతోనే పోలవరం 72 శాతం పూర్తి చేశామని అన్నారు. పోలవరం పూర్తి కావాలంటే బీజేపీతో పొత్తు అవసరమని చెప్పారు. జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏపీ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని చెప్పారు. జగన్ హయాంలో పాలన జరగలేదని.. విధ్వంసం జరిగిందని చెప్పారు. ప్రజలు జీవితాలు నాశనమయ్యాని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని గాడిన పెట్టాలంటే జగన్ ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
చిలకలూరిపేటలో జనసేన అధినేత ఉగ్రరూపాన్ని చూపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పొడవడానికి ఆయన పడిన శ్రమ అంతాఇంతా కాదు. చివరికి అది సక్సెస్ అయ్యి.. కూటమి మొదటి సభ డబుల్ సక్సెస్ కావడంతో.. పవన్ కళ్లలో విజయకేతనం కనిపించింది. రాష్ట్ర భవిష్యత్ బాగుపడటానికి మరెన్నోరోజులు లేదనే ధీమా ఆయనలో కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఈ సభలో పవన్ వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఏపీలో కూటమి విజయం ఖాయమైందని జనసేన అధినేత పవన్ అన్నారు. జగన్ వ్యవస్థలను ద్వంసం చేశారని మండిపడ్డారు. ప్రపంచం డిజిటల్ వైపు నడుస్తుంటే.. జగన్ మాత్రం లిక్కర్ షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్లు తొలగించారని విమర్శించారు. ఏటా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వకాలతో జగన్ బినామీలు 40 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోయాయని ఆరోపించారు. మళ్లీ పాలన గాడిన పడాలంటే కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.