Ayyanna Patrudu: తాజాగా విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేయడంతో ఏపీలో వార్తలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. గన్నవరం సభలో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి పోలీసులు తమ వాహనంలో ఆయనను విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. కానీ హఠాత్తుగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద నేషనల్ హైవేపై ఆయనను పోలీసులు విడిచిపెట్టారు.
అయ్యన్నకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర అయ్యన్న ఉన్న హోటల్ వద్దకు చేరుకుని ఆయనను కలిశారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు నక్కపల్లి ప్రాంతంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై అయ్యన్న స్పందించారు. విశాఖ ఎయిర్ పోర్టుకు రాగానే హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.
అయితే, విశాఖ నుంచి తాళ్లపాలెం వరకు తనని తీసుకువచ్చారని, ఆ సమయంలో పై అధికారుల నుంచి ఫోన్ రావడంతో 41 నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు వచ్చి గన్నవరం సమావేశంలో మాట్లాడిన వ్యవహారంకి సంబందించి నన్ను అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. 10 రోజులలోపు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి తనను వదిలేశారని తెలిపారు. అయితే, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై పోరాటం చేస్తామని, పోలీసులు ఎప్పుడు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. కొడతారా కొట్టండి, చంపేస్తారా చంపేయండి, రాష్ట్రం కోసం చనిపోయేందుకు సిద్ధం అంటూ అయ్యన్న షాకింగ్ కామెంట్స్ చేశారు.