అయితే ప్రస్తుతం ఏపీలో కాపుల ఓటు బ్యాంక్ బలంగా వుంది. దాదాపు 14 నుంచి 15 శాతం కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలు ఉన్నాయి. బీసీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన తమ నుంచి ముఖ్యమంత్రి కావాలనే కోరిక వారిలో చాలా కాలంగా వుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టడంతో కాంగ్రెస్, టీడీపీలలో వణుకు పుట్టింది. ప్రజారాజ్యం స్థాపించిన మొదట్లో చిరంజీవి సభలకు జనం వెల్లువెత్తడాన్ని చూసి, కనీసం 50 చోట్ల గెలవొచ్చనే ప్రచారం జరిగింది. అయితే 18 సీట్లకే మాత్రమే పరిమితమైంది. వైఎస్సార్ మరణానంతరం ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారాయి. వైఎస్ జగన్ సొంత కుంపటి పెట్టుకోవడంతో ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్కు పీఆర్పీ అవసరం ఏర్పడింది.
చివరికి కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేయాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పీఆర్పీని స్థాపించి ఎన్నికల బరిలో మెగాస్టార్ నిలిచారు. టీడీపీ, కాంగ్రెస్లకు దీటుగా ఆయన ఎదురొడ్డి పోరాడారు. చిరంజీవి నాడు పోరాట స్ఫూర్తి కనబరిచారు. కాగా వచ్చే ఎన్నికలలో అనగా 2024లో పొత్తులతో బరిలో దిగుతాను అంటున్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందలేనని బహిరంగంగా ప్రకటించారు. తాను సీఎం అభ్యర్థిని కాదని తేల్చి చెప్పారు. సీఎం జగన్ను గద్దె దించడం తప్ప, తనకు ఏ లక్ష్యం లేదని స్పష్టం చేశారు. పవన్ను సీఎంగా చూడాలన్న కాపుల ఆశ గోవిందా. అసలు జనసేనను ఎందుకు స్థాపించారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. తమ నాయకుడిగా ఏదో ఉద్ధరిస్తాడని ఇంత కాలం అనుకున్నామని, తీరా ఇప్పుడు చంద్రబాబు పల్లకీ మోయాలని పవన్ చెప్పడం చూసి సిగ్గుపడుతున్నామని ఆయన సామాజిక వర్గ నేతలు వాపోతున్నారు. పవన్తో పోల్చితే చిరంజీవి వేల రెట్లు గొప్పోడని కాపు నేతలు అంటున్నారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి, హేమాహేమీలైన చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్రెడ్డిలతో తలపడ్డారని గుర్తు చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం పోరాట స్ఫూర్తి కనబరచకుండానే ప్రత్యర్థుల ప్యాకేజీ విమర్శలకు బలం చేకూర్చేలా టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.