CM Jagan: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి సీఎం జగన్ లో కనిపిస్తుంది. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెంనాయుడు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనని ఎలాగైనా ఓడించాలని కసితో దువ్వాడ శ్రీనివాస్ కి ఆరు మాసాల ముందే టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్. అయితే రాజకీయ చదరంగంలో ఎలాంటి ఎత్తుగడవేశారో తెలియదు కానీ జడ్పీ మెంబర్ గా ఉన్న శ్రీనివాస్ భార్య వాణికి టికెట్ ఇస్తామని చెప్పారు.
కానీ ఎన్నికలవేళ వచ్చేసరికి మళ్ళీ రాజకీయ చదరంగంలో పావులు కదిపిన జగన్ మనసు మార్చుకొని టికెట్ దువ్వాడ శ్రీనివాస్ కి ఇవ్వటానికి నిశ్చయించుకున్నారు. అయితే ఈ విషయంలో వాణి ప్రతిఘటించారు. పోటీ నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. టికెట్టు నాకు ఇస్తానని చెప్పి తర్వాత వెనక్కి ఎలా తీసుకుంటారు అంటూ ఆవేశపడ్డారు. ఆ క్రమంలోనే ఆమె ఇండిపెండెంట్ గా నామినేషన్ కూడా వేసేసారు.
అయితే ఒకే నియోజకవర్గం నుంచి భార్యాభర్తలిద్దరూ పోటీ చేస్తే వైసీపీ కి ఓటు బ్యాంకు చెదిరిపోతుందని భావించిన అధిష్టానం రంగంలోకి దిగింది. దంపతులిద్దరిని పిలిపించుకొని వైయస్ జగన్ సర్ది చెప్పటానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే వాణి మొదట వైఎస్ జగన్ కు సైతం ఎదురు తిరిగారని, అయితే జగన్ మాత్రం అచ్చెన్నను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇది పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదని నచ్చచెప్పారంట.
అంతేకాకుండా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ని గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని శ్రీనివాస్ గెలిచిన తరువాత ఆయన ఎమ్మెల్సీ సీటు వాణికి ఇస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో వాణి మెత్తబడి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సీఎం జగన్ కి హామీ ఇచ్చారంట. వాణి తీసుకున్న ఈ నిర్ణయంతో సీఎం జగన్ కి టెక్కలి నియోజకవర్గం నుంచి తలెత్తిన పెద్ద భారం తీరినట్లు అయింది.