CM KCR: తాజాగా తెలంగాణ సీఎం హైదరాబాద్కు సమీపంలో ఉన్న జడ్చర్లను ఐటీ హబ్, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్లో అంబలి కేంద్రాలు పెడుతుంటే చూసి దుఃఖం వచ్చేది. నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాం.
కొందరు పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నారు కానీ.. చేసిందేమీ లేదు. కృష్ణా జలాల్లో మన హక్కు సాధించడం కోసం ఎంతో పోరాటం చేసాము. పాలమూరు ఎత్తిపోతల పథకం సోర్సును శ్రీశైలం నుంచి తీసుకున్నాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి జలాలు తీసుకోవాలని కొందరు చెప్పారు. 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి నీరు తీసుకుంటే మనకు సరిపోతాయా? ఇప్పుడు కూడా కొందరు నేతలు అలాంటి సలహాలే ఇస్తున్నారు.
కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60ఏళ్లు గోసపడ్డాము. ఉన్న తెలంగాణను పోగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు.. పోరాటం చేసి సాధించుకున్నాం. చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించా. 9ఏళ్ల పోరాటం తర్వాత పాలమూరుకు అనుమతులు వచ్చాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తయ్యాయి. మోటార్లు బిగిస్తున్నారు. రాబోయే3 4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో బ్రహ్మాండంగా నీళ్లను చూడబోతున్నాం. పాలమూరులో కరవు అనేది పోతది. ఉద్దండాపూర్ ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు.