Amanchi Krishna Mohan: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీలోకి వెళ్లడం సర్వసాధారణంగా జరిగే అంశం అయితే ఈసారి కార్యకర్తలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున నాయకులు కూడా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసిపి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నటువంటి చీరాల మాజీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. కాంగ్రెస్ లో చేరుతున్నారు.
ఇలా ఈయన వైసిపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు స్పష్టంగా అధికారక ప్రకటన కూడా చేశారు. వైసీపీలో 2019 ఎన్నికలకు ముందు చేరిన ఆమంచి.. చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేశారు. వైసీపీ హవా జోరుగా సాగినా ఆయన విజయం దక్కించుకోలేకపోయారు.
ఇదే సమయంలో టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన కరణం బలరాం విజయం దక్కించుకున్నారు. ఇలా ఈయన ఎన్నికలలో ఓడిపోవడంతో ఆమంచికి పెద్దగా ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత లభించలేదని చెప్పాలి. ఇలా తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో అక్కడ వైసిపి నేతలతో ఈయనకు విభేదాలు వచ్చాయి కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు.
అయితే తీరా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ కూడా ఈయన ఎలాంటి విమర్శలు చేయకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తనని బాగా చూసుకున్నారని ప్రోత్సహించారంటూ తెలియజేశారు. ఇలా వైసిపిలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఈయన వెల్లడించారు.