Cricket: శ్రీలంకతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా తొలివన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్కు అందుబాటులోకి వచ్చారు. రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు వన్డే సిరీస్లో ఆడబోతున్నారు. దీంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్లలో ఎవరికి అవకాశం దక్కుతుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో డబుల్ సెంచరీతో రాణించిన ఇషాన్ కిషన్ కూడా జట్టులో అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కారణం కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ను పక్కనపెట్టే సాహసం రోహిత్ చేస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోవాలంటే కేఎల్ రాహుల్ను పక్కన పెట్టాలి. అటు టీ20లలో సూర్యకుమార్ భీకర ఫామ్లో ఉండగా.. వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరిలో రోహిత్ ఎవరిని తీసుకుంటాడో వేచి చూడాలి.
మరోవైపు ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యాకు చోటు ఖరారు కాగా మరో బెర్త్ కోసం అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్లలో ఒకరికి అవకాశం దక్కనుంది. అటు స్పిన్ విభాగంలో చాహల్, కుల్దీప్ మధ్య పోటీ నెలకొంది. పేస్ బాధ్యతలను షమీ, సిరాజ్ పంచుకోనుండగా మరో బౌలర్గా అర్ష్దీప్ లేదా ఉమ్రాన్ మాలిక్లలో ఒకరు ఆడే అవకాశముంది. మొత్తానికి జట్టు ఎంపిక రోహిత్ శర్మకు పెద్ద సవాల్గా మారింది. వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది.
వన్డే సిరీస్కు బుమ్రా దూరం
శ్రీలంకతో వన్డే సిరీస్కు ఒక్కరోజు ముందు జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని.. దీంతో అతడిని దూరం పెడుతున్నట్లు బీసీసీఐ వివరించింది. బుమ్రా కోలుకునేందుకు మరో నెలరోజుల సమయం పడుతుందని.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడటం కూడా అనుమానమేనని తెలుస్తోంది. బుమ్రా పునరాగమనానికి మరింత సమయం పడుతుందని.. ముందు జాగ్రత్తగా అతడిని ఈ సిరీస్కు దూరం పెడుతున్నట్లు మాత్రమే బీసీసీఐ వెల్లడించింది.