Tollywood: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూతతో సినీ ప్రపంచంతోపాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పాత తరం హీరోలంతా వరుసగా దివికేగుతూ మనకు దూరమవుతున్నారంటూ అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ.. ఇలా వరుసగా సీనియర్ హీరోలంతా మనకు దూరం కావడంతో బాధాతప్త హృదయాలతో అభిమానులు కుంగిపోతున్నారు.
ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మృతితో మహేష్ బాబు కుటుంబం తీవ్ర శోకంలో ఉన్నారు. నవంబర్ 15న తెల్లవారుజామున కృష్ణ మృతి చెందారు. ఇండస్ట్రీకి చెందిన అనేక మంది అగ్ర నటులు, సినీ, రాజకీయ ప్రముఖులంతా కృష్ణ నివాసానికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇటీవలే మృతి చెందిన కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి కూడా వెళ్లి కృష్ణకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్యామలాదేవి.. భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణంరాజుకు కృష్ణతో చాలా అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులన్నారు. ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారని, ఒకేసారి చనిపోవాలని అనుకున్నారో ఏమో.. ఇద్దరూ మనకు బాధను మిగిల్చి వెళ్లిపోయారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
వారిద్దరూ చిరస్మరణీయులుగా ఉండిపోతారు..
మహేష్ బాబుకు వరుసగా అన్న, తల్లి, తండ్రిని దూరం చేసి దేవుడు తీవ్ర విషాదం మిగిల్చాడని శ్యామలాదేవి విచారం వ్యక్తం చేశారు. సుల్తాన్ సినిమా నుంచి కృష్ణ కుటుంబంతో తనకూ మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. షూటింగ్లో భాగంగా ఓసారి అండమాన్లో నెలరోజులపాటు ఉండాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో కృష్ణ భార్య విజయనిర్మల అందరికీ వంట చేసి పెట్టేవారని శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు కృష్ణ, కృష్ణంరాజు చిరస్మరణీయులుగా ఉండిపోతారని చెబుతూ కన్నీంటి పర్యంతమయ్యారు శ్యామలాదేవి.