Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి, రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు లోకేశ్. ఈ యాత్రను ఏ విధంగా అణచివేయాలనే ధోరణితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదానికి ఉదాహరణలతో వివరించారు. ఇదే సందర్భంలో సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర సంభాషణ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాను. ఇక బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా మద్దుల మామయ్య. ఆయన అన్ స్టాపబుల్. బాలయ్య కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షోకు మొదట ఉండేది నేనే అని లోకేశ్ అన్నారు. అదే సందర్భంలో జనసేనాని పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే ముందు మంచి మనసు ఉండాలని 2014 ఎన్నికల్లో పవన్లో ఆ మంచి మనసును చూశానన్నారు.ఇలాంటివారు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలన్నారు
2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగే యోచనలో ఉంది టీడీపీ. ఈ నేపథ్యంలో ఏపీని అభివృద్దిలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ పిలుపునివ్వడం, అందులోనూ ప్రత్యేకంగా మెగా బ్రదర్స్ గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేశ్.