Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ప్రజలు విషాదంలో మునిగిపోయారు. అలనాటి అగ్రహీరోలంతా మన మధ్య లేకుండా పోతుండడం అభిమానులను కలచివేస్తోంది. కృష్ణ తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు, ఆయన అగ్రెసివ్నెస్ను గుర్తు చేసుకుంటూ అభిమానులు బాధాతప్త హృదయాలతో కన్నీటిపర్యంతమవుతున్నారు. టీవీ చానళ్లు కృష్ణతో గతంలో జరిపిన ఇంటర్వ్యూలను ప్రసారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేక మధుర స్మృతులు గుర్తు చేసుకుంటున్నారు.
ఓ సీనియర్ జర్నలిస్ట్ జరిపిన ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. తాము సినిమాల్లో యాక్టివ్గా ఉన్న సమయాల్లో ఏం జరిగిందో చెబుతూ వచ్చారు. ఇప్పటి తరం సినిమాలకు, మీ తరం మూవీలకు తేడా ఎలా ఉందని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. 1980లలో 30 రోజుల్లోనే తన సినిమాలు షూటింగ్ పూర్తయ్యేవని చెప్పారు. కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ తదితర డైరెక్టర్లు 40 నుంచి 60 రోజుల్లోపు మూవీలు తీసేవారన్నారు. తన డైరెక్షన్లో గరిష్టంగా 30 రోజుల్లోపే సినిమాలు పూర్తయ్యేవని చెప్పారు. ఇప్పటి తరం ఎందుకు ఏళ్లతరబడి తీస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ కృష్ణ కామెంట్ చేశారు.
మరోవైపు సీనియర్ ఎన్టీఆర్తో ర్యాపో గురించి కూడా కృష్ణ మాట్లాడారు. రాజకీయంగా రాజీవ్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరి తాను ఎంపీగా గెలిచానన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అప్పటి నుంచే ఉందన్నారు. అయితే, రాజీవ్ గాంధీ మరణంతో రాజకీయాలపై ఆసక్తి చచ్చిపోయిందని కృష్ణ తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ఎన్టీఆర్ అప్పుడప్పుడూ కలిసేవారని కృష్ణ తెలిపారు. రాజకీయంగా మాత్రమే తమకు విభేదాలు ఉండేవని, వ్యక్తిగతంగా బాగా పలకరించుకొనే వారమన్నారు. ఏం బ్రదర్.. ఎలా ఉన్నారు.. ఇంకా మా మీద సినిమాలు తీస్తున్నారా? అంటూ ప్రశ్నించి నవ్వులు పూయించేవారని కృష్ణ గుర్తు చేశారు.
నంద్యాలలో రాళ్లు విసిరారు..
ఈ క్రమంలో ఓ రాజకీయ ఘటనను కృష్ణ గుర్తు చేసుకున్నారు. నంద్యాల పర్యటనలో భాగంగా ఓసారి తనపై రాళ్లు వేశారని కృష్ణ తెలిపారు. అదంతా రాజకీయాల్లో భాగమని, వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం ఉండదన్నారు. ఎన్టీఆర్తో కూడా రాజకీయంగా మాత్రమే విభేదాలు ఉండేవని కృష్ణ స్పష్టం చేశారు.