Anganwadi Workers: అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ను ఉరవకొండలో అంగన్వాడీలు అడ్డుకున్నారు. జనవరి 23న ఉరవకొండలో సీఎం పర్యటన ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఉరవకొండలో సభా ప్రాంగణాన్ని పరిశీలించి గుంతకల్లు వైపు వెళుతున్న కాన్వాయ్ ను తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఒక్కసారిగా మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు.
తమకు న్యాయం చేయాలని వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి కాన్వాయ్ని ముందుకు కదలకుండా అడ్డుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాన్వాయ్ లో కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. దీంతో ఉరవకొండ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది పలువురు అంగన్వాడీలు గాయపడ్డారు. పోలీసులు బలవంతంగా అంగన్వాడీలను పక్కకు జరిపి పెద్దిరెడ్డి వాహనాన్ని ముందుకి పంపించారు.
నెల రోజులకు పైగా తమ సమస్యలను పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు మహిళా పోలీసులైతే అంగన్వాడీల చెంప చెల్లుమనిపించారు. పోలీసుల దాడిలో ఓ అంగన్వాడీ కార్యకర్త తీవ్రంగా గాయపడింది చికిత్స నిమిత్తం కార్యకర్తను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో శిబిరం వద్దకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. తమ గోడు కేశవ్ దగ్గర వెళ్ళబోసుకున్నారు అంగన్వాడి కార్యకర్తలు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె లు నేటితో 40 రోజులకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలపై నిర్బంధ చట్టాన్ని ఎత్తివేయాలని టర్మినేట్ చట్టాన్ని వెనక్కి తీసుకురావాలని వాళ్ళ వేతనం పెంచాలని ప్రకాశం జిల్లా కొండేపి లో రాస్తారోకో చేశారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరని తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు కార్మిక సంఘాల నాయకులు తెలియజేశారు.