Former MLA Bikshapati: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నం క్రమంలో ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో మోదీకి వ్యతిరేకంగా కీలక పాత్ర పోషించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీని ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ ఉండటంతో దేశ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రాంతీయ పార్టీగానే గుర్తిస్తారు. అందుకే భారత రాష్ట్ర సమితిగా మార్చారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలపై ముందుగా కేసీఆర్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. త్వరలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ తర్వాత ఏపీలోని విజయవాడలో నిర్వహించే అవకావముందని ప్రచారం సాగుతోంది. కేసీఆర్ జాతీయ పార్టీకి ఇప్పటికే వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. మిగతా పార్టీలు కూడా పార్టీలు ఎవరైనా పెట్టవచ్చని, అందులో ఏముందని చెబుతున్నారు. ఏపీలో అధికార వైసీపీ నేతలు, తెలంగాణలో బీజేపీ నేతలు అదే చెబుతున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న తరుణంలో ఆ పార్టీకి తొలి షాక్ తగిలింది. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి టీఆర్ఎస్ ను వీడారు. బీజేపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్ లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను బిక్షపతి కలిశారు. బీజేపీలో చేరే విషయంపై ఆయన చర్చించారు. పార్టీ నేతలు కూడా ఓకే చెప్పడంతో.. బిక్షపతి బీజేపీ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు.
గతంలో 2009 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖపై బిక్షపతి ఓడిపోయారు. ఇక 2012లో పరకాలకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి కొండా సురేఖపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా.. సీఎం కేసీఆర్ వేరేవారికి కేటాయించారు. ఆ తర్వాత నుంచి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నప్పటికీ.. ఎలాంటి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేత అయిన తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనలో ఉన్నారు.
పార్టీలో తనకు ఆదరణ కరువైందనే అసంతృప్తితో గత కొంతకాలంగా బిక్షపతి ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండటం, ఆ పార్టీ నేతలు సంప్రదించడంతో బిక్షపతి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సందర్భంగా కేసీఆర్ పై బిక్షపతి తీవ్ర ఆరోపణలు చేశారు. విధివిధానాలు, ఏపపక్ష పొకడలు నచ్చకే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు విమర్శించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించిన మరుసటి రోజే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడటం గులాబీ వర్గాలను షాక్ కు గురి చేసింది. టీఆర్ఎస్ లోని అసంతృప్తులను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలు ఆ పార్టీని వీడి ఇప్పటికే బీజేపీలో చేరారు.