IRR Case: గత కొద్దిరోజులుగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా టీడీపీ నేతలు ఆయనను కనీసం బయటకు తీసుకురాలేక పోతున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయ్యాయి. న్యాయస్థానాల్లో ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు చంద్రబాబుకు న్యాయస్థానాల్లో కోరుకున్నట్టు జరిగేదనే పేరు వుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తి విరుద్ధంగా మారాయి. అయితే తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం పోరాడుతున్న చంద్రబాబుకు ఆశించిన ఫలితం దక్కలేదు.
స్కిల్ స్కామ్లో చంద్రబాబునాయుడు ఇప్పటికే అరెస్ట్ అయి నెలకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ కేసులో ఆయన ఎప్పుడు బయటికొస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆ కేసులో బాబు క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు ముగిశాయి. తీర్పు కోసం రెండు రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. క్వాష్ పిటిషన్పై బాబు భవిష్యత్ ఆధారపడి వుంది..ఈ కేసులో ఎలా బయట పడాలో దిక్కుతోచని స్థితిలో ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారాన్ని సీఐడీ ముందుకు తెచ్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు బాబు లాయర్లు పరుగులు తీశారు. ముందస్తు బెయిల్పై విచారణను మరోసారి హైకోర్టు వాయిదా వేసింది. నవంబర్ 7న తిరిగి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
దీంతో బాబు, ఆయన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఒకదాని వెంట మరొక కేసు బాబును వెంటాడుతున్నాయి. మరోవైపు న్యాయస్థానాల్లో కేసుల విచారణ వేగంగా జరగడం లేదనే ఆవేదన వారిలో వుంది. అయితే ఇదంతా కూడా జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అని కావాలనే చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితులు తీసుకు వస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.