Channel Reporters: తాజాగా తిరుపతి పోలీసులు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కు సంబంధించిన రిపోర్టర్లు ముసుగు దందాలకు పాల్పడుతుండడంతో సూర్యనారాయణ రాజు, సునీల్, కెమెరామెన్లు రామకృష్ణ, బాలు లను అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. రెండు నెలల క్రితం తిరుమల పరకామణిలో దొంగతనం కేసులో రవికుమార్ స్వామి అనే వ్యక్తి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో సదరు స్వామికి ప్రైమ్9 న్యూస్ రిపోర్టర్లు, కెమెరామెన్లు ఫోన్ చేసి మీ గురించి తమ చానల్తో పాటు మిగిలిన చానళ్లలో కథనాలు ప్రసారం చేస్తామని, కుటుంబ పరువు పోతుందని, అలా జరగకుండా వుండాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్కు దిగారట.
చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్నామని, మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తేవాలని స్వామి, ఆయన కుటుంబ సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా కూడా రిపోర్టర్లు, కెమెరామెన్లు వినిపించుకోలేదు. స్వామి కుటుంబ సభ్యులు వీరి ఫోన్కాల్స్ను రిసీవ్ చేసుకోకపోవడంతో, వారి స్నేహితుడు బాలకృష్ణా రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. స్వామి కి సంబంధించిన వీడియోలను చూపుతూ, ప్రసారం చేస్తే కుటుంబ పరువుబజారున పడుతుందని డబ్బు కోసం బెదిరింపులకు దిగారు. దాంతో స్వామి కుటుంబ సభ్యులు ఆత్మహత్య తప్ప మరొక దారి లేదు అని ఎంత బ్రతిమిలాడుకున్నా కూడా ప్రైమ్ 9 రిపోర్టర్లు కెమెరామెన్ లు మాత్రం వారిని అలాగే వేదించసాగారు.
రూ.50 లక్షల్లో తమ సీఈవో, ఇతర చానళ్ల రిపోర్టర్ లకు ఇవ్వాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు తిరుపతి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే రీతిలో తిరుపతి, తిరుమలలో చిన్నచిన్న వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు తదితరులను బెదిరిస్తూ దందాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.