ODI Series: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో 67 పరుగుల భారీ తేడాతో టీమిండియా గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 83), శుభ్మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 113 పరుగులతో చెలరేగాడు.
దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. సూర్యకుమార్ను కాదని శ్రేయాస్ అయ్యర్ను ఈ మ్యాచ్లో తీసుకోగా అతడు అంచనాల మేర రాణించలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (14), అక్షర్ పటేల్ (9) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ సాధించారు.
374 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. అయితే ఎప్పటి తరహాలో చివరి వికెట్లను తీయడంలో మన బౌలర్లు తడబడ్డారు. 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఓటమిని ఖరారు చేసుకున్న దశలోనూ శ్రీలంక అద్భుతంగా పోరాడింది. 9వ వికెట్కు అభేద్యంగా ఏకంగా 100 పరుగులను జోడించింది.
సెంచరీతో వణికించిన షనక
తొలి వన్డేలో ఏ దశలోనూ శ్రీలంక గెలిచేలా కనిపించలేదు. అయితే ఆ జట్టు కెప్టెన్ షనక మాత్రం సెంచరీతో చెలరేగాడు. రన్రేట్ పెరిగిపోవడంతో మ్యాచ్ ఎలాగూ గెలవలేమని అర్ధం అయ్యాక అతడు చెలరేగి ఆడాడు. 88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 108 నాటౌట్తో మ్యాచ్ తుదికంటా నిలిచాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(72) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, చాహల్, షమీ తలో వికెట్ సాధించారు.