IPL: ప్రపంచమే ఓ కుగ్రామం అంటారు వ్యాపారవేత్తలు. తమ వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా సరిహద్దులను చెరిపేస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో వ్యాపారవేత్తలు ఈ పదాన్ని వాడతారు. క్రీడల్లో కూడా ఇది వర్తిస్తుంది. అదీ ఇదీ అనే తేడా లేకుండా ప్రతీ క్రీడలోనూ లీగ్స్ వచ్చాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన ఫుట్బాల్, క్రికెట్, రేసింగ్, బాస్కెట్ బాల్, హాకీ వంటి క్రీడలలో కూడా ఫ్రాంచైజీలు వచ్చాయి. ఒకే దేశం ఒకే ఫ్రాంచైజీ అనే సరిహద్దులు చెరిపేస్తూ ఆటగాళ్లు కూడా వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం అలా చేయనంటుంది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వివిధ దేశాల ఆటగాళ్లను తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నది. అయితే భారత జట్టు ఆటగాళ్లను మాత్రం ఐపీఎల్, భారత జాతీయ జట్టు, దేశవాళీలో తప్పితే ఇతర దేశాలలో ఆడించదు. ఒకవేళ ఎవరైనా క్రికెటర్ తాను ఇతర దేశాలలో జరిగే ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆడాలంటే బీసీసీఐతో తెగదెంపులు చేసుకోవాల్సిందే. ఈ విషయంలో బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది.
తాజాగా ఐపీఎల్ కొత్త చైర్మెన్ అరుణ్ ధుమాల్ కూడా ఇదే విషయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టాడు. భారత ఆటగాళ్లను ఇతర లీగ్లలో ఆడించేది లేదని.. అందుకు తాము అనుమతివ్వబోమని తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ మాట్లాడుతూ.. ‘లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లను ఇతర లీగ్ లు ఆడించేందుకు అనుమతించం. ఆ మేరకు మేం ఒక నియమం పెట్టుకున్నాం. ప్రస్తుతానికైతే దానికే కట్టుబడి ఉన్నాం. ఆటగాళ్ల శ్రేయస్సును కోరి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికైతే ఆ నిర్ణయాన్నే కొనసాగిస్తాం..’ అని తెలిపాడు.
“#BCCI will continue to not allow Indian players participating in overseas leagues” : IPL Chairman (Arun Dhumal)
— H!manshu (@_thereal_hp) November 8, 2022