Chandrababu Naidu: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాజాగా మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టో గురించి ఏపీలో అనేక రకాల వార్తలు వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మేనిఫెస్టోపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. ఈ మేనిఫెస్టో టీడీపీకి గుదిబండగా మారుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంక్కు ఈ మేనిఫెస్టో భారీగా గండి కొడుతుందనే అనుమానం, భయం టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్రాప్లో చంద్రబాబు పడి, మరోసారి రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధమయ్యారనే అభిప్రాయాలు టీడీపీ సీనియర్ నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
గత నాలుగేళ్లుగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీలో మరే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, కూర్చొని ఊరికే తినవాళ్లకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతున్నారని, అలాగే రాష్ట్రం శ్రీలంక, వెనుజలా, పాకిస్తాన్ అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తామంటూ, మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్కు గురి అవుతున్నారు. సంక్షేమానికి వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ చాంపియన్లగా నిలిచారు.
చంద్రబాబును అభివృద్ధి చేసే పాలకుడిగా జనం చూస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా సంక్షేమ పథకాలు భారంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొంత ఉపశమనం వుంటుందని కొన్ని వర్గాలు భావిస్తూ వచ్చాయి. వీళ్లంతా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు. అయితే రెడ్ల నుంచి కూడా జగన్పై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ జగన్ తన ఓటు బ్యాంక్గా భావిస్తున్న వర్గాల్లో సంక్షేమ పథకాల లబ్ధి, అలాగే అధికారంలో వాటా తదితర అంశాలు సానుకూల వైఖరిని ఏర్పరిచాయి. ఇక చంద్రబాబుకు మిగిలిందల్లా సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్న మధ్య తరగతి, తటస్థులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, ఉద్యోగులు, మేధావుల వర్గాలు. జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాలు ఏపీ ని ముంచేస్తాయా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మరి తన మేనిఫెస్టోని వెనక్కి తీసుకొని రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తారేమో చూడాలి మరి..