Balayya: బాలయ్య వీరసింహారెడ్డి సినిమా మరో రెండు రోజుల్లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సంక్రాంతికి వస్తోన్న ఐదు సినిమాల్లో తమిళ హీరో అజిత్ నటించిన తెగింపు సినిమా తర్వాత ఆ రేసులో బాలయ్య సినిమా ఉంది. వీరసింహారెడ్డి సినిమా ఇప్పటికే సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది. అయితే బాలయ్య అఖండ సినిమాకు వచ్చినంత బజ్ ఈ సినిమాకు మాత్రం రాలేదని చెప్పొచ్చు.
వీరసింహారెడ్డి సినిమా నుంచి ఒక్కో స్టిల్, ఒక్కో సాంగ్, టీజర్, ట్రైలర్ వదులుతున్న కొద్ది బజ్ అయితే బాగా పెరుగుతూ వస్తూ ఉంది. ఈ సినిమా ట్రైలర్ సినిమా అంచనాలను ఇంకాస్త పెంచిందని చెప్పాలి. ఈ సినిమాలోని ఆకాశంలోకి వెళితే మాస్ మొగుడు అనే సాంగ్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాలయ్య నామస్మరణ మారుమోగుతోంది. దీనికి తోడు వీరసింహారెడ్డి సినిమా కంటే ఒక రోజు ముందు రావాల్సిన విజయ్ వారసుడు ఇప్పుడు 14వ తేదికి వెళ్లడంతో లైన్ క్లియర్ అయ్యింది.
వారసుడు సినిమా వాయిదా పడటంతో వీరసింహారెడ్డికి కాస్త ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు. అజిత్ తెగింపు సినిమా కూడా 11వ తేదిన ఎక్కువ థియేటర్లలో విడుదల కానుంది. ఆ రోజుతోనే ఆ సినిమా బడాయి ఏంటో తేలిపోతుంది. ఇక 12వ తేదిన 90 శాతానికి పైగా థియేటర్లలో బాలయ్య సినిమానే విడుదల కానుంది. ఇప్పటికే ఆంధ్రా, నైజాం అంతా కూడా బాలయ్య నామస్మరణ వినపడుతూనే ఉంది. దీంతో వీరసింహారెడ్డికి అడ్వాన్స్ బుకింగ్లు కూడా బాగుండడంతో భారీ ఓపెనింగ్స్ అయితే పక్కా అని సమాచారం అందుతోంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారంగా చూస్తే వీరసింహారెడ్డికి మొదటి రోజు రూ.25 నుంచి 30 కోట్ల షేర్ వస్తుందని చెప్పొచ్చు. అయితే ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే దాదాపు అన్ని స్క్రీన్లు దొరకడంతో ఈ ఫిగర్ మరింత పెరుగుతుందనే అంచనా ఉంది. ఇక ఈ సినిమా గురించి మంచి టాక్ వస్తే బాలయ్య క్రియేట్ చేసే సరికొత్త రికార్డులకు అంతా ఇంతా కాదని తెలుస్తోంది.