Pawan CM: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన వారాహి యాత్ర విడివిడిగా సాగుతోంది. ఈ యాత్రలో భాగంగానే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ అటు బీజేపీతో కలిపి సాగుతూనే టీడీపీ వైపు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని తాను ముఖ్యమంత్రిని అవుతాను అని మాట్లాడడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనే విషయంపై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే పవన్ మాటల్లో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
అందులో ఒకటి రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోంది.
రెండవది వైసీపీ నేతల అరాచకాల గురించి మాట్లాడుతుండటం. ఏపీ రాష్ట్రంలో జనసేన అధికారంలోకి రావాలంటే ఒంటరిగా లేదా వేరే పార్టీతో కలిసి కనీసం 90 సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలో జనసేనకు 30 స్థానాలలో మాత్రమే గెలిచే అంత బలముందని పవన్ స్వయంగా చెబుతున్నారు. అంటే మిగిలిన 60 సీట్లు మిత్రపక్షం గెలవాల్సి ఉంటుందన్న మాట! ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు కానీ టీడీపీ కి అయితే పక్కా ఉంది. కనుక పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నారనుకొంటే, అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకొన్న టీడీపీకే ముఖ్యమంత్రి దక్కుతుంది తప్ప జనసేన కాదు కదా? కానీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని, ముఖ్యమంత్రిని అవుతానని నమ్మకంగా చెపుతున్నారంటే టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయా?
పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించి కలిసి పోటీ చేయబోతున్నాయా?అన్న సందేహాలు కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ విదంగా చెపుతున్నప్పటికీ టీడీపీ, బీజేపీ నేతలు ఎవరు స్పందించడం లేదు. స్పందించకపోవడమే ఈ అనుమానానికి కారణం. పవన్ తనకు ప్రాణహాని ఉందని, తనను లేపేసేందుకు సుపారీ గ్యాంగులను దింపారని పవన్ చేస్తున్న వ్యాఖ్యలను తేలికగా కొట్టిపారేయలేము. కాకినాడ అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు పెట్టి మరీ హెచ్చరించారు. ఆయన గూండాలను మెయింటెయిన్ చేస్తూ ప్రజలను, ముఖ్యంగా జనసేన కార్యకర్తలను, వీర మహిళలను బెదిరిస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన పనిపడతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.