Ponguleti Srinivas Reddy: తెలంగాణకు ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. మునుగోడు ఉపఎన్నికలను వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా పార్టీలన్నీ భావిస్తున్నాయి. సెమీ ఫైనల్ లాంటి మునుగోడు ఉపఎన్నికలో గెలిచి రాబోయే ఫైనల్ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి రాజకీయ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పార్టీలన్నీ తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీలన్నీ తెరదీశాయి. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకుని ప్రత్యర్థి పార్టీలను వీక్ చేయాలని భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో జంపింగ్ జపాంగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరుతారో అర్థం కావడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలలోకి చేరికలు ఎక్కువయ్యాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేరికపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బలమైన నేతలను తమవైపు తిప్పుకనేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో హస్తం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి.
ఇక కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ కూడా చేరికలపై కసరత్తు చేస్తోంది. ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి సీనియన్ నేతలతో కలిసి చేరికల కమిటీని పార్టీలో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ సుదీర్ఘకాలం టీఆర్ఎస్ లో పనిచేయడంతో ఆ పార్టీలోని నేతలతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ లోని ఉద్యమ నేతలు, ఇతర నేతలను బీజేపీలో చేరాలని ఆయన ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎష్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే కొంతమంది చేరగా.. తాజాగా ఓ బడా నేత టీఆర్ఎస్ నుంచి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో నేతల మధ్య అంతర్గత విబేధాలు నడుస్తన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో ఇతర నేతలకు పొసగడం లేదు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా పొంగులేటికి దూరం పెరిగింది. దీంతో గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్లొనడం లేదు. దీంతో పొంగులేటి ఏ క్షణమైనా కమలం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకకుంది.
ఈ క్రమంలో తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు రిసెప్షన్ కు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ హాజరుకావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పంక్షన్ కు టీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరుకాకపోవడం, ఈటల రావడం చర్చనీయాంశంగా మారింది. పొంగులేటిని ఈటల బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో చేరిక విషయంపై పొంగులేటి సమాలోచనలు చేస్తున్నారట. ఈ నెల 21న తెలంగాణకు అమిత్ షా వస్తున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి బీజేపీ చేరికపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా పొంగులేటి గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పొంగులేటికి కాకుండా నామా నాగేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ సీటు దక్కింది. ఇక రాజ్యసభ పదవి ఇస్తారేమోనని పొంగులేటి ఆశలు పెట్టుకున్నారు. అది కూడా రాకపోవడంతో టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కూతురు రిసెన్షన్ వేడుకలో టీఆర్ఎస్ నేతలు రాకుండా బీజేపీ నేతలు ఎక్కువమంది కనిపించడంతో.. కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.