Rajendra Prasad: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు,కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆ తరం ఈతరం రెండు తరాల ప్రేక్షకులకు రాజేంద్రప్రసాద్ సుపరిచితమే. ఇక అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ వంశీ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
వంశీ రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన.. లేడీస్ టైలర్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ ఫస్ట్ విడుదల సినిమాలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇందులో లేడీస్ టైలర్ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటి అర్చన ఇద్దరు జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించలేదు. ఇది ఇలా ఉంటే దాదాపుగా 37 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్,అర్చన జోడిగా ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా షష్టిపూర్తి. ఈ సినిమాలో రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ స్టోరీ షష్టిపూర్తి కథాంశంతో ఉండనుంది.
ఈ సినిమా కథ మొత్తం రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. అలాగే సంగీతం ప్రధానంగా కూడా సినిమా కథ సాగనుంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ ప్రభ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 1 న చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇళయరాజా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రూపేష్కుమార్ చౌదరినే ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో మొదలు పెట్టి, జూలైలో మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. కాగా ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, ఆచ్యుత్ కుమార్, వై విజయ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.