Pulivendula: తాజాగా పులివెందులలో ప్రత్యేకమైన పోలీసు బృందాలు దిగాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వద్ద ప్రత్యేకంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పులివెందులలో ఏదో జరగబోతుంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పులివెందులలో రద్దీ ప్రాంతాల్లో కూడా స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు విధుల్లో కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి గొడవలు లేకపోయినా ఉన్నపలంగా పులివెందుల్లో ఇలా స్పెషల్ పార్టీ పోలీసులు రావడంతో అనేక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.
ఇకపోతే నేడు సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీత ఫిటిషన్ పై విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 24వ తేదీ వరకూ సీబీఐ అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ పై ఉత్కంఠ నెలకొంది. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని ఇప్పటికే న్యాయస్థానానికి సీబీఐ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వరుసగా అవినాష్రెడ్డిని సీబీఐ విచారించింది. అలాగే గత రెండు రోజులుగా పులివెందులలో సీబీఐ బృందం కీలక సోదాలు నిర్వహించింది. ఇదే విషయంపై సీబీఐ అవినాష్ రెడ్డిని కొన్ని గంటలపాటు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా సీబీఐ మరో బృందం కీలక ఆధారాలను ఇవాళ్టి విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు సమర్పించవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. సుప్రీంకోర్టులో తమకు అనుకూలమైన ఆదేశాలు వస్తాయనే ఉద్దేశంతో సీబీఐ ముందస్తు పోలీసు బలగాలను పులివెందుల్లో దించారనే ప్రచారం జరుగుతోంది.