Pulivendula: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈసారి తప్పకుండా తామే గెలుస్తామ. అధికారంలోకి మళ్లీ వైసీపీ నే రా వస్తుంది అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర ప్రజల చల్లని దీవెనలు తమకే ఉన్నాయని వైసీపీ నాయకులు , అధిష్టానం కూడా పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్న ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చోటు చేసుకున్న పరిణామంపై మాత్రం రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెర పోతున్నారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా ఫోకస్ పెంచారు.
ఈ నేపథ్యంలో నిజంగానే ఈ విషయాన్ని వైసీపీ సీరియస్గా తీసుకోవాల్సిందే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమ డిక్లరేషన్ పేరుతో సీమ జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పర్యటనను ఆయన కర్నూలు నుంచి ప్రారంభించారు. తాజాగా బుధవారం చంద్రబాబు సీఎం జగన్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పులివెందులనే టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా రోడ్ షో నిర్వహించారు. అదేసమయంలో సభను కూడా ఏర్పాటు చేశారు. కీలకమైన పూల అంగళ్ల జంక్షన్ సహా నాలుగు రోడ్లకూడలిలో చంద్రబాబు పర్యటించారు.
మనకు రాజధాని ఏది అని చంద్రబాబు ప్రశ్నించగా అందరూ గుండుగుత్తగా అమరావతి-అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మూడు రాజధానులు అవసరమా? అని ప్రశ్నించగా లేదు-లేదు అంటు చంద్రబాబుకు సమాధానం చెప్పారు. అంతేకాకుండా మద్యం పై బాదుడు వైన్ షాపుల్లో ఫోన్ పే లేకపోవడం వంటివాటిని చంద్రబాబు ప్రశ్నిస్తూ ఈ సొమ్ము ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. దీనికి చాలా ఆశ్చర్యకరంగా అధికార పార్టీ నేతలకే అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించడం గమనార్హం. ఈ పరిణామంతో పులివెందులలో ఏదో మార్పు చోటు చేసుకుంటోందనే చర్చ తెరమీదకి వచ్చింది. దీంతో వైసీపీ కూడా దీనిపై సీరియస్గానే చర్చించాలని అంటున్నారు పరిశీలకులు. అంతేకాకుండా పులివెందులలో అమరావతి అంటూ నినాదాలు హోరెత్తించడంతో జగన్ కు ఊహించని షాక్ ఎదురైనట్టుంది. వాస్తవానికి సీఎం జగన్ సహా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట వంటి నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ఆదరణ లభిస్తుందన్నది ఒట్టిమాటే అనే టాక్ వినిపిస్తుంటుంది. కానీ తాజాగా చంద్రబాబు పర్యటనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడి నుంచో రాలేదు. నియోజకవర్గం నుంచే వచ్చిన ప్రజలతో ఇక్కడి కూడళ్లు కిక్కిరిసిపోయాయి.