Assembly Elections 2024: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓట్లు.. జనసేనకు, జనసేన ఓట్లు టీడీపీకి పడాల్సిందేనని చెప్పారు. పొత్తు కుదరడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. తన కష్టానికి తగిన ఫలితం లభించాలంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసి పని చేయాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు బీజేపీ ఆశీస్సులు చాలా అవసరమని పవన్ అన్నారు. అందుకే పొత్తుకు ఒప్పించడానికి టీడీపీ, బీజేపీ మధ్య చాలా నలిగిపోయానని చెప్పారు. టీడీపీతో పొత్తుకు ఒప్పించడానికి జాతీయ నాయకులతో ఎన్ని చీవాట్లు తిన్నానో తనకు మాత్రమే తెలుసని కార్యకర్తలతో అన్నారు. ఈ కష్టాన్ని, పడిన మాటలకు ఫలితం కనిపించేలా పని చేయాలని సూచించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా సాదారణంగా అనిపించవచ్చు కానీ.. అందులో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే.. టీడీపీతో బీజేపీ కలుస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ఎన్డీఏకి వ్యతిరేకంగా బలమైన కూటమిని కట్టారు. ఆ టైంలో పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైట్ జరగకపోతే.. బీజేపీ ఓటమి ఖాయం అనే పరిస్థితి వచ్చింది. చెట్టుకి ఒకరు అనేలా ఉన్న నాయకులను చంద్రబాబు ఒకే గూటికి తీసుకొని వచ్చారు. దీంతో.. టీడీపీకి ఇంకా తలుపులు మూసేశామని బీజేపీ జాతీయ నాయకులు చెప్పారు.
అయితే, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కానీ.. బీజేపీ, టీడీపీ మధ్య ఇప్పుడు పొత్తు కుదరడానికి ఆ రెండు పార్టీ నేతల కంటే పపవ్ ప్రయత్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి జనసేన అధినేత ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలనివ్వను అని చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే సీట్లు విషయంలో నెంబర్ అటూ ఇటూ అయినా తల వంచుకొని వెళ్తున్నారు. గత ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేయడం వలన జరిగిన నష్టాన్ని చూశారు. ఈ సారి ఆ నష్టం జరగకుండా ఉండాలనేది పవన్ ఆలోచన. అందుకే, ఈసారి కూటమితోనే జగన్ పై పోరాటం చేయాలని అనుకున్నారు.
టీడీపీతో జనసేన పొత్తు ఈజీగానే కుదిరింది కానీ.. బీజేపీని టీడీపీతో ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బీజేపీకి ఏపీలో పెద్దగా ఓట్లు లేవు. కానీ, బీజేపీ.. పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందనే ప్రచారం ఉంది. ప్రచారం మాత్రమే కాదు.. గత ఎన్నికల్లో మోడీ ఆశీస్సులు కూడా జగన్ కు అందాయి. అది బహిరంగ రహస్యమే. ఆ ఆశీస్సులు మరోసారి జగన్కు అందితే వైసీపీ నేతలు ఎన్నికల టైంలో అరాచాకాలు చేస్తారని పవన్ భయం. పోల్ మేజేజ్మెంట్లో జగన్ ది పై చేయి కాకుండా ఉండాలంటే.. బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో ఉండాల్సిందేనని పవన్ బలంగా నమ్మారు.
ఈ పొత్తు టీడీపీలో చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే… బీజేపీపై ఏపీలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకే, బీజేపీపై కోపంగా ఉన్న ఓటర్లు టీడీపీకి దూరంగా అవుతారని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, ఎన్నికల సమయంలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే బీజేపీ అండదండలు కావాలి. మొత్తానికి పవన్ తను అనుకున్నది సాధించారు. ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది కనుక చతురంగ బలాలు కూటమి వైపే ఉన్నాయి కనుక గెలుపు ఖాయమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.