IT Employees: ఏపీలో ప్రస్తుతం గద్దర్గందరగోళ గోల పరిస్థితులు నెలకొంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి 50 రోజులు అయిన సందర్భంగా ఆయన అరెస్టును ఖండిస్తూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం జనసంద్రమైంది. చంద్రబాబు నాయుడు అభిమానుల వెల్లువతో నిండిపోయింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన అభిమానులు, ఐటీ ఉద్యోగులు జై చంద్రబాబు, సీబీఎన్ జిందాబాద్, మేము సైతం బాబు కోసం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో హోరెత్తించారు.
దాంతో ఆ ప్రాంగణం మొత్తం బాబు పేరుతో బాబు నినాదాలతో మార్మోగిపోయింది. హైదరాబాద్లో సైబర్టవర్స్ నిర్మించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో తాజాగా సాయంత్రం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన అభిమానులతో స్టేడియం గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి.
చంద్రబాబు నామస్మరణతో స్టేడియం మార్మోగింది. చంద్రబాబు విజన్, నాయకత్వంపై సినీ దర్శకులు క్రాంతి వలజ రూపొందించిన గీతాన్ని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. హైదరాబాద్, ఐటీ రంగాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిపై రూపొందించిన వీడియోను కూడా ఆవిష్కరించారు. బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ సభ్యులు సంగీతంతో అందరినీ ఉర్రూతలూగించారు.
సినీ సంగీత దర్శకుడు అనూప్రూబెన్స్ బృందం చంద్రబాబుపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆలపించి అందరినీ హుషారెత్తించింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, మనవడు చైతన్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ ఎమ్మెల్సీ అశోక్బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబును జైల్లో పెట్టడంతో తెలుగు ప్రజల గుండెలు మండిపోతున్నాయి. అరాచక శక్తులకు గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు.