YCP: ‘టీడీపీ కార్యకర్తలు, నేతలు చేసిన సాయాన్ని నిద్రలో కూడా మర్చిపోను. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటా’.. ఈ కామెంట్స్ టీడీపీకి చెందిన ఏ కీలకనేతో లేదంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డో కాదు. జగన్ మనిషి. అవును ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఖమ్మంలోని టీడీపీ ఆఫీస్కు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహంపై పూలు చల్లి నమస్కరించారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం ప్రెస్మీట్ పెట్టి టీడీపీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల అందించిన సహాకారంతోనే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. దొరలపాలనకు అంతమొందించడానికి కారణం తెలుగుతమ్ముళ్ల కృషి అని పొంగిలేటి చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు అదమరిచి అజాగ్రత్తగా ఉన్నారేమో కానీ.. టీడీపీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ ను గెలిపించేవరకూ నిద్ర పోలేదంటూ ఆకాశమంత ఎత్తున పొగడ్తలలో ముంచెత్తారు. ఇకపై కాంగ్రెస్ వేరు, టీడీపీ వేరు కాదని.. భవిష్యత్ లో కూడా ఇలాగే కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు తమ్ముళ్ల సేవలను మర్చిపోదని అన్నారు.
అయితే, తెలుగు దేశం పార్టీపై పొంగులేటి ప్రశంసల వర్షం కురిపించడంలో తప్పులేదు. ఎందకంటే ఆయన చెప్పినట్టు అన్ని వర్గాలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపించి కాంగ్రెస్ ను గెలిపించాలని కంకణం కట్టుకున్నాయి. అందులో టీడీపీ కూడా ఒకటి. అందుకే తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడంలో తప్పులేదు. కానీ, అవి తెలంగాణ కార్యకర్తలు, నేతలు పరిమితం చేయకుండా చంద్రబాబు, లోకేష్ ప్రస్తావన కూడా తీసుకొని వచ్చారు. పైగా పొంగులేటి ఇలాంటి కామెంట్స్ చేయడం పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే, పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి కావొచ్చు కానీ.. ఆయన ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్ శాసిస్తే.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే సత్తా ఉన్న నాయకుడు అని పొంగులేటి గురించి వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు.
నిజానికి వైసీపీ కార్యకర్తలు చెప్పినట్టు జగన్తో ఆ స్థాయి సాన్నిహిత్యం పొంగులేటికి ఉంది. జగన్ ప్రోత్సాహంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జగన్ పొంగులేటికి తెలంగాణలో పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ, మారిన రాజకీయాల పరిస్థితుల వలన పొంగులేటి బీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ, బీఆర్ఎస్ లో చేరిక కూడా జగన్ అనుమతితోనే జరిగిందని చాలా సార్లు ఆయన చెప్పారు. అందుకే, పార్టీ మారిన తర్వాత కూడా ఇద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం కొనసాగింది. ఏపీలో పలు కాంట్రాక్టులు కూడా జగన్ సర్కార్ పొంగులేటికి ఇచ్చింది. అలాంటి పొంగులేటి ఇలాంటి కామెంట్స్ చేయడం వైసీపీ వర్గాలకు అంతుపట్టడం లేదు. దీంతో, శీనన్న ఇంత పని చేశావ్ ఏంటీ అన్న అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అయితే, పొంగులేటి కామెంట్స్ వెనక లోతైన వ్యూహం ఉందని అంతా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. అందుకే ఆయన ఓ పొలిటిషియన్ లా కాకుండా పారిశ్రామిక వేత్తలా ఆలోచించారని అంటున్నారు. ఇప్పటిలాగే.. టీడీపీ ప్రభుత్వం వచ్చినా.. తన ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఇలాంటి కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి ఇలాంటి కామెంట్స్ చేయడం వైసీపీకి ఇబ్బందికర పరిణామమేనని చెప్పాలి.’