Janhvi Kapoor: అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చిత్ర సీమలో ఇంకా నిలదొక్కుకోలేదు. బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించింది. తనకు శ్రీదేవి అంతటి ఇమేజ్ సొంతం చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, తనకు పెద్దగా ట్యాలెంట్ లేకపోవచ్చు కానీ, కష్టపడే తత్వం ఉందని చెబుతోంది ఈ బ్యూటీ. వారసత్వంగా కాకుండా సొంత ట్యాలెంట్ తో ఎదుగుతానని చెబుతోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ అనేక విషయాలు పంచుకుంది. తన తల్లి ఇమేజ్ తో తాను ఇండస్ట్రీలో ఎదగాలనుకోవడం లేదని స్పష్టం చేసింది జాన్వీ. షూటింగ్ సమయాల్లో ఎంత కష్టమైనా నటనలో తన నైపుణ్యం చూపుతానంటూ చెబుతోంది. తనకు గొప్ప ప్రతిభ లేకున్నా, సెట్స్ లో వంద శాతం శ్రమిస్తానంటోంది. ఈ విషయంలో అనుమానాలకు తావులేదని చెప్పింది. కష్టపడే తత్వమే తనను ఇండస్ట్రీలో నిలబెడుతుందని భరోసాగా ఉంది జాన్వీ.
షూటింగ్స్ లో తాను ఎంత కష్టడతానో ప్రూవ్ చేయడానికి తన రక్తంతో రాసిస్తానంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది ఈ అమ్మడు. అంత పెద్ద మాటలెందుకు లేమ్మా.. బాగా నటిస్తే నీకు మంచి పేరు, ఖ్యాతి దానంతట అవే వస్తాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ధడక్ సినిమాలో జాన్వీ కపూర్ నటన బేసిక్ స్థాయిలోనే ఉందన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. శ్రీదేవి అంతటి నటనా చాతుర్యం రావాలంటే జానూ ఇంకా చాలా కష్టపడాలనే వాదన ఉంది.
ఇక శ్రీదేవి దక్షిణాది సినిమాల్లో నటించడంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తనకు సౌత్ లో ఎవరు ఇష్టమంటే.. విజయ్ దేవరకొండ అని ఓ షోలో జాన్వీ కపూర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ తో సినిమా వస్తుందంటూ ఊహాగానాలు వచ్చాయి. దానిపై జాన్వీ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ కూడా వెండితెర అరంగేట్రానికి సిద్ధమవుతోందట. వీరిద్దరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాషన్ డ్రెస్ లతో స్టైలిష్ లుక్ లతో ఫొటోలు షేర్ చేస్తూ, వీడియోలు పెడుతూ కనుల విందు చేస్తుంటారు.