Uttar Pradesh: దేశం, రాష్ట్రం తరఫున వివిధ క్రీడాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సకల సౌకర్యాలు కల్పిస్తారు. నాణ్యమైన భోజనం, మెరుగైన వైద్యం అందిస్తారు. కానీ.. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అమ్మాయిలకు ఘోర అవమానం ఎదురైంది. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అమ్మాయిలకు టాయిలెట్ గదిలో భోజనం వడ్డించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అక్కడి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
షహరాన్పూర్ జిల్లాలో ఈ నెల 16న అండర్–17 బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గిన్నెలను టాయిలెట్ గదిలో పెట్టగా అందులోంచే అమ్మాయిలు వడ్డించుకుని తినడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అలాగే, పూరీలను టాయిలెట్ గదిలో నేలపై ఓ పేపర్ వేసి ఉంచారు. ఇది చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచే క్రీడాకారిణులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్లు చేస్తున్నారు.
వీడియో కాస్తా బయటకు వచ్చి వైరల్ కావడంతో షహరాన్పూర్ క్రీడా అధికారి అనిమేష్ సక్సేనా స్పందించారు. వర్షం పడుతుండడంతో మరో మార్గం లేక స్విమ్మింగ్ పూల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశామని, స్టేడియం నిర్మాణ దశలో ఉండడం, వర్షం పడుతుండడంతో వంట పాత్రలను తప్పనిసరి పరిస్థితుల్లో చేంజింగ్ రూములో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు, ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘జై శ్రీరామ్ అని కానీ, భారత్ మాతా కీ జై’ అని కానీ ఎవరూ నినదించడం లేదంటూ యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వీళ్లెవరూ ఏమీ చేయరని, ఎవరూ మారరని మరో నెటిజన్ పేర్కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం తాను పెద్దమొత్తంలో సమర్పించుకున్నానని, నిజానికి దాని ఖర్చు రూ. 2 వేలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు ఇచ్చే లేకపోతే ఏదో ఒక కారణంతో మనల్ని పక్కనపెట్టేస్తారని పేర్కొన్నాడు. మరో యూజర్ ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఈ అమ్మాయిలకు మీరు సాయం చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కోల్పోతారని అన్నాడు. కాగా, కబడ్డీ అమ్మాయిలకు టాయిలెట్లో అన్నం వడ్డించడంపై నలువైపుల నుంచి విమర్శల దాడి మొదలవడంతో యూపీ ప్రభుత్వం దిగివచ్చి సంబంధిత అధికారిని తొలగించినట్లు తెలిసింది.
#UttarPradesh | Viral video shows under-17 kabaddi players served rice in toilet; government blames it on ‘space crunch’ pic.twitter.com/zKA7RWif3F
— NDTV (@ndtv) September 20, 2022