Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కూతురు శ్వేత టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనుందని కేశినేని నాని ట్వీట్ చేశారు.తాజాగా శ్వేత కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ విషయాన్ని కేసినేని ముందే తన ట్వీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. కేశినేని శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. కాగా విజయవాడ కేశినేని శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీలో చేరేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒక వారం పది రోజుల్లో ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయం అనిపిస్తోంది. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచే ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో తాను పోటీ చేయబోనని నాని పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన కలివిడిగా ఉంటున్నారు. ఎంపీ నియోజకవర్గ నిధులు కూడా వారు సూచించిన పనులకే ఇచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ శ్రేణులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రొటోకాల్ పేరుతో నాని తన విధానాన్ని సమర్థించుకునేవారు.
ఇదిలా ఇండగా మరోవైపు నాని కుమార్తె, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 11వ వార్డు టీడీపీ కార్పొరేటర్గా ఉన్న కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా వేడిగా మారాయి. ఈ మేరకు శ్వేత రాజీనామా చేయడంతో మేయర్ భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు.