Kethamreddy: మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నసమయంలో జనసేన పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు కీలక నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లేఖ కూడా రాశారు. మొదట కాంగ్రెస్ లో ఉండే తను అనంతరం యువతకు ప్రాధాన్యం కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరానని తెలిపారు. నెల్లూరు సిటీలో తన పనిని గుర్తించిన పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు.
ఆ ఎన్నికలలో ఓడినా తాను ఏనాడు విశ్వాసాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తనకు జనసేనలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని, పార్టీ కార్యక్రమాలకు పిలవలేదని ఈ అవమానాలన్నీ పంటిబిగువున భరించానని చెప్పుకొచ్చారు.దీని అంతటికి కారణం నాదెండ్ల మనోహర్ అని అతనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేతం రెడ్డి. చంద్రయాన్-1 సమయంలో జనసేన పార్టీకి బీజాలు పడ్డాయని ఇప్పుడు చంద్రయాన్ త్రీ cతో మనం చంద్రుడి మీదకు కూడా చేరాం.
కానీ జనసేన పార్టీలో ఎదగాలి అనుకునే వారు మాత్రం శూన్యంలో సున్నా చుడుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ నాశనం చేస్తున్నారని, ఇప్పుడు ఆయనకు తెదేపా వారు తోడైయ్యారని ఆరోపించారు. పార్టీలో నెంబర్ టూ గా పిలుస్తున్న నాదెండ్ల మనోహర్ తనపై కుట్రలు చేశారని, తనపై పవన్ కు లేనిపోనివి చెప్పారని తెలిపారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు తన ఆత్మ అభిమానాన్ని దెబ్బతీశాయని చెప్పారు.
టిక్కెట్ కోసం పార్టీని ఏనాడూ అభ్యర్థించ లేదని, తాను ప్రస్తుత పరిస్థితులలో అవమానాలను భరిస్తూ జనసేన లో ఉండలేనని తన ఓర్పు సహనం నశించిందని చెప్పారు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి తనతో కలిసి పని చేసిన అనేకమంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ కి రిజైన్ చేశానని చెప్పారు. పవన్ కళ్యాణ్ చుట్టూ పనికిమాలిన వాళ్ళు చేరారని అందుకే విసుగు చెందిన తాను వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు కేతంరెడ్డి.