KRK: బాలీవుడ్ సినిమాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) ఒకరు. తనని తాను సినీ క్రిటిక్గా పరిచయం చేసుకుని.. బాలీవుడ్లో విడుదలైన సినిమాలపై రివ్యూలు చెబుతుంటాడు. అలాగే ట్విట్టర్లో ఎప్పటికప్పుడు వివాదాలకు తెర లేపుతుంటాడు. అలా ఇప్పటివరకు ఎన్నో వివాదాల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలపై వివాదాస్పదమైన ట్విట్ చేశాడు. పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర’ సినిమాలు నిర్మాతకు వందల కోట్లల్లో నష్టాన్ని మిగిల్చాయని పేర్కొన్నాడు. దాంతో ట్విట్ నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ట్విట్పై మండిపడుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీ కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఆస్కార్ బరిలో కూడా నిలిచినట్లు సమాచారం. బిగ్గేస్ట్ హిట్ అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చిందని సినీ క్రిటిక్ కేఆర్కే ఆరోపించారు. కేఆర్కే తన ట్విట్టర్ అకౌంట్లో.. ‘ఈ ఏడాదిలో టాప్-5 డిజాస్టర్ సినిమాలు.. ‘బ్రహ్మాస్త్రం, ఆర్ఆర్ఆర్, పృథ్వీరాజ్, లాల్సింగ్ చడ్డా, విక్రమ్ వేదా’ అని అన్నారు.
బ్రహ్మాస్త్రం సినిమా వల్ల రూ.300 కోట్లు, ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల రూ.200 కోట్లు, పృథ్వీరాజ్ సినిమా వల్ల రూ.150 కోట్లు, లాల్సింగ్ చడ్డా సినిమా వల్ల రూ.125 కోట్లు, విక్రమ్ వేదా వల్ల రూ.100 కోట్లు నష్టం వాటిళ్లిందని, నిర్మాత నిండా మునిగారని చెప్పుకొచ్చాడు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే సినీ క్రిటిక్ కేఆర్కే చేసిన ట్విట్పై.. నెట్టిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భారీ వసూళ్లు రాబట్టిన సినిమా నిర్మాతకు నష్టం ఎలా చేకూర్చిందని ఆలోచిస్తున్నారు. అసలు ఈ ట్విట్లో వాస్తవం లేదని కొందరు కొట్టిపడేస్తున్నారు.