MaheshBabu: తండ్రి కృష్ణను కోల్పోయిన బాధలో కూడా మహేష్ బాబు గొప్ప మనసును చాటుకున్నాడు. కుంగిపోయిన దశలో ఉండి కూడా తనలోకి మానవత్వాన్ని బయటకు తీశాడు. సూపర్స్టార్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. కృష్ణను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తిండీతిప్పలు లేకుండా కృష్ణ ఇంటి బయట పడిగాపులు కాశారు. అది గమనించిన మహేష్ బాబు గొప్ప పని చేశారు. కృష్ణను చూసేందుకు వచ్చిన అభిమానుల కోసం భోజనం ఏర్పాటు చేయించాడు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. పుట్టెడు దుఃఖంలో కూడా అభిమానుల ఆకలి తెలుసుకున్న రియల్ హీరోవని మహేష్ బాబును పొగుడుతున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణను సోమవారం కుటుంబసభ్యులు హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆయన శరీరంలోని అవయవాలు పని చేయకుండా పోయాయి. దీంతో మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ పరిశ్రమ మూగబోయింది. కృష్ణ పార్థీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. మృతదేహాన్ని నానక్రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థీవదేహాన్ని పద్మాలయ స్టూడియోస్లో కొన్ని గంటలపాటు ఉంచారు. బుధవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి.
కాగా, ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి ఓ సినిమా కూడా చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానప్పటికీ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే తండ్రి మృతి వల్ల కొద్ది రోజులపాటు మహేష్ బాబు షూటింగ్లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.