Memorial: సూపర్స్టార్ కృష్ణ మెమోరియల్ను ఏర్పాటు చేసే ఆలోచనలో మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మారక చిహ్నం కేవలం ఒక విగ్రహం, సమాధికే పరిమితం కాకుండా చూసుకుంటున్నారట. అందుకోసం మహేష్ బాబు భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే.. నలుగురు వచ్చి చూసేలా, కొంచెం సేపటి వరకు అక్కడ సేద తీరేలా ఉండాలని మహేశ్ బాబు ఆలోచిస్తున్నారట.
సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350కుపైగా సినిమాల్లో నటించారు. ఆయనకు సంబంధించిన అవార్డులు, బహుమతులు, షీల్డ్ లు అధికంగానే ఉన్నాయి. వాటిని ఓ పద్ధతిలో ఏర్పాటు చేసి.. మెమోరియల్లో ఉంచనున్నారు. స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి.. వాటి చుట్టూ వీటిని ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలుస్తోంది. అలాగే కృష్ణ నటించిన కీలక సినిమాల పాత్రల ఫోటోలు, హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాల వివరాలు కూడా తెలియజేసేలా ప్రదర్శించనున్నారు. ఈ మెమోరియల్ భవనాన్ని ఫిలింనగర్లోని పద్మాలయా స్టూడియోలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఏ హీరో హైదరాబాద్లో ఇలాంటి కాన్సెప్ట్ తో మెమోరియల్ను ఏర్పాటు చేసింది లేదు. ఎన్టీఆర్ మెమోరియల్లో కేవలం సమాధి మాత్రమే ఉంది. అంతేకానీ ఆయనకు సంబంధించిన అవార్డులు, గుర్తులు, బహుమతులు లేవు. ఎన్టీఆర్కు సంబంధించిన అవార్డులు లక్ష్మీపార్వతి దగ్గర ఉండేవి. వాటిని అప్పట్లో హరికృష్ణ అండ్ కంపెనీ స్వాధీనం చేసుకుంది.
అలాగే ఏఎన్నార్కు సంబంధించిన అవార్డులు ఒక్క దగ్గర లేవు. అయితే నాగార్జున కూడా మహేష్ బాబు అనుకున్న విధంగా మెమోరియల్ను ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. కానీ ఆ విషయాన్నే మర్చిపోయారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్కు సంబంధించిన అవార్డులు భద్రపరిస్తే.. గతంలో దొంగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్కు సంబంధించిన విగ్రహం కూడా లేదు. అందుకే మహేష్ బాబు ప్రజలు, అభిమానులు చూసేలా స్మారక మందిరాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.