PM Modi: వందే భారత్ పేరుతో హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రైళ్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలు బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. సామాన్యులకు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు పేదల రైళ్ల రద్దు మాటేంటని ప్రశ్నిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా సమయంలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. అన్ని రకాల ప్రజా రవాణ వ్యవస్థలను రద్దు చేసిన ప్రభుత్వం,అనంతరం వాటిని పునరుద్దరించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే ప్రజా రవాణలో రైళ్లు ప్రధానమైనవి. వీటిని మోడీ ప్రభుత్వం చాలా వరకు రద్దు చేసింది.
తెలంగాణ వరకు మాత్రమే చూసుకుంటే ఏకంగా 76 ప్యాసింజర్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. గత బడ్జెట్ లో కూడా ఎక్కడా కొత్త ప్యాసింజర్ రైళ్ల గురించి కేంద్రం ఊసెత్తలేదు. ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందిన 12 స్లీపర్ కోచ్ రైళ్లను కూడా శాశ్వతంగా రద్దు చేసింది. ఎస్సీఆర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న 46 ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.