Nagpur: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది వారికి తెలియని విషయాలు అన్నీ స్మార్ట్ ఫోన్ ల ద్వారా నేర్చుకుంటున్నారు. తెలియని విషయాలు నేర్చుకుంటే మంచిదే కానీ అనవసరమైన విషయాలు కూడా నేర్చుకొని లేనిపోని ఇబ్బందులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు టెక్నాలజీని ఇష్టం వచ్చినట్లు వాడి ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా కూడా ఒక మైనర్ బాలిక యూట్యూబ్ లో చూసి ఒక పని చేసింది. చివరికి దారుణమైన నిర్ణయం తీసుకుంది.. అసలేం జరిగిందంటే..
ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర నాగ్పూర్ లోని అంబజారీ పోలీసు స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక ఒక యువకుడి ద్వారా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఇంట్లోవారికి చెప్పకుండా దాచిపెట్టింది. పొట్ట ఉబ్బెత్తుగా ఉండటంతో తల్లి ప్రశ్నించగా హెల్త్ ఇష్యూగా చెప్పుకొచ్చింది. ఆస్పత్రికి వెళ్దామని చెప్పినా అదే నయం అవుతుంది అంటూ దాటవేసింది. ఈ క్రమంలో మార్చి 2న తల్లి కూలీ పనులకు వెళ్లిన సమయంలో బాలికకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనను భరించలేకపోయిన సదరు బాలిక యూట్యూబ్లో వీడియోలు చూసి తనకు తానే ప్రసవం చేసుకుంది.
ఆ తర్వాత పుట్టిన ఆడబిడ్డను గొంతునులిమి చంపేసింది. అనంతరం అంతటితో ఆగని ఆ బాలిక శిశువు మృతదేహాన్ని ఒక పెట్టలో పెట్టి ఇంట్లో ఓ మూలన దాచి పెట్టింది. తీవ్రరక్తస్రావంతో కదల్లేని స్థితిలో ఉన్న బాలిక ఇంట్లోనే అలాగే ఉండిపోయింది. కూలీ పనులకు వెళ్లొచ్చిన తల్లి ఇంట్లో రక్తపు మరకలు, బాలిక ఆరోగ్య పరిస్థితిని చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం బాలికకు చికిత్స అందుతోంది. కాగా, బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడు ఆమెకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని తెలిసింది. ఏక్ ఠాకూర్ అనే ఆ యువకుడితో బాలిక కొన్నాళ్లు చాట్ చేసింది. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరగడంతో తొమ్మిది నెలల కింద వీళ్లు కలుసుకున్నారు. ఈ క్రమంలో బాలికను ఫ్రెండ్ రూమ్కు తీసుకెళ్లిన యువకుడు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమె మీద అత్యాచారం చేశాడు.