Nara Brahmani: ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే ఏపీలో వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. జగన్ సిద్ధం అంటుంటే.. చంద్రబాబు కదలి రా అంటున్నారు. పవన్ మూడు రోజుల క్రితమే ప్రచారాన్ని మొదలు పెడితే.. లోకేష్ కూడా శంఖారావం పూరించారు. యువగళం యాత్ర తర్వాత లోకేష్ శంఖారావం సభలతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంతో.. లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిపై ఆయన సతీమణి నారా బ్రాహ్మిణి ఫోకస్ చేశారు.
మంగళగిరి నియోజకర్గాన్ని అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ టీడీపీ బోణీ కొట్టలేదు. గత ఎన్నికల్లో స్వయంగా లోకేష్ పోటీ చేసినా ఫలితం మారలేదు. ఈసారి కూడా లోకేష్ అక్కడి నుంచి పోటీకి సై అంటున్నారు. అంతేకాదు గెలిచి చూపిస్తానని సవాల్ చేస్తున్నారు. వైసీపీ మరోసారి అక్కడ గెలిచి లోకేష్ నాయకత్వంపై టీడీపీలో అనుమానాలు పెంచాలని ప్రయత్నిస్తోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సొంత నిధులతో లోకేష్ సంక్షేమ పథకాలను అక్కడ అమలు చేస్తున్నారు. దీంతో.. బలమైన అభ్యర్థిని దించితే కానీ గెలవడం కష్టమని భావించిన వైసీపీ అధిష్టానం బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్దమైంది. అందులో భాగంగా గంజి చిరంజీవిని ఇంఛార్జిగా ప్రకటించింది. అయితే, ఆయనకు కూడా బీఫాం వస్తుందో రాదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ బలైమన అభ్యర్థిని పెట్టడానికి వైసీపీ నానా తంటాలు పెడుతుంది. మంగళగిరిలో గెలుపు కోసం ఏకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రత్యకదృష్టి పెట్టారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ ఫుల్ ఫోకస్డ్గా ఉంటే లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనలతో బిజీగా ఉన్నారు. దీంతో.. బ్రాహ్మణి రంగంలోకి దిగారు. ఎలాగైనా మంగళగిరిలో ఖాతా తెరవాల్సిందేనని ఆమె సీరియస్గా తీసుకున్నారు. అందుకే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలవ్వక ముందే బ్రాహ్మణి అలర్ట్ అయ్యారు. భర్త గెలుపు కోసం చేనేత కార్మికులతో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత గవర్నమెంట్ అందిస్తున్న నేతన్నహస్తం పథకం అమలుపైనా ఆరా తీశారు. చంద్రబాబు సీఎం అయితేనే మంచిరోజులు వస్తాయని బ్రాహ్మణీ చెప్పారు.
బ్రాహ్మణి వ్యూహాత్మకంగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. మంగళగిరిలో మెజార్టీ సామాజిక వర్గంగా చేనేతలు ఉన్నారు. వారే అక్కడ గెలుపోటములను డిసైడ్ చేస్తారు. దీంతో.. బ్రాహ్మణి మొదట చేనేత కార్మికుల ఉన్న పాంతాల్లో పర్యటించారు. లోకేష్ పథకాలకు బ్రాహ్మణి ప్రచారంతోడైతే మంగళగిరిలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు.