Narayana: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పార్టీ నేతలు అధినేతలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించారు. అలాగే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలి అని అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పార్టీ అధినేతలు బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరు సిటీ నియోజకవర్గం టికెట్ను మాజీ మంత్రి, కాపు నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణకు ఇస్తున్నట్టు టీడీపీ అధికారులు వెల్లడించారు.
ఈయనకు ఈ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ రావడంతో ఈయన సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే గతంలో ఈయన పై కేవలం 3000 ఓట్ల మెజార్టీతో ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు.
వీరిద్దరి మధ్య కేవలం 3000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండడంతో ఈసారి నారాయణ గెలుపు ఖాయమని అందరూ భావిస్తున్నారు. గెలిచే విధంగా కూడా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఏ మండలాల్లో అయితే తనకు మెజారిటీ తక్కువగా ఉందో ఆయా మండలాలపై ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను నియమించి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇకపోతే గతంలో టిడిపికి జనసేనతో పొత్తు లేదు ఈసారి పొత్తు కూడా ఉండడంతో నారాయణదే విజయం అంటూ పలువురు రాజకీయ నాయకులు భావించగా నారాయణ కూడా తనదే విజయం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నారాయణ మాత్రమే కాకుండా తన భార్య కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరి తన భర్తను గెలిపించాలి అంటూ ఈమె కోరుతున్నారు. ఇది కూడా నారాయణకు బాగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.