AP Politics: ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. సమయం దగ్గర పడే కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాయి. ఒకపక్క అధికార వైసీపీ అభ్యర్థులు మార్పు పైన పనిచేస్తుంటే మరోపక్క టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఎంచుకుంటూ పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బయటపెడుతున్నాయి. బిజెపి కూడా త్వరలో తన కార్యాచరణను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడంతో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవం వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశ భావ వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలను టార్గెట్ చేసుకునే పని చేస్తుంటే… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరో రాజకీయ పార్టీ ఎంట్రీ ఇవ్వనుంది.మాజీ ఐఏఎస్ అధికారి.. విజయకుమార్ కొత్తగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన విజయవాడలో సమావేశం నిర్వహించారు. దీనికి రాజకీయంగా తటస్థంగా ఉన్న నాయకులు, మేధావి వర్గాన్ని, యువతను ఆహ్వానించారు.గతంలో చంద్రబాబు హయాంలోను,ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ హయాంలోనూ విజయకుమార్ పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయనను కొన్నాళ్ల కిందట దూరంపెట్టింది.
అయితే విజయ్ కుమార్ ను రిటైర్ అయిన తర్వాత విద్యాశాఖ సలహాదారుడుగా తీసుకున్నారు. అయితే ఆయన పనులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని పూర్తిగా దూరం పెట్టేశారు. అయితే గతంలో విజయ్ కుమార్ టిడిపి పార్టీలోకి ఆహ్వానించిందని గుంటూరు జిల్లా లేదా ప్రకాశం జిల్లా నుండి సీటు ఇస్తామని చెప్పిందని వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఎస్సీ ఓటు బ్యాంకు, యువత ఓటుబ్యాంకు లక్ష్యంగా విజయకుమార్ రాజకీయాలు సాగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటిని తట్టుకుని విజయ్ కుమార్ పార్టీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.