Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి విజయ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ జన సందోహం అభిమానులు జనసేన నేతల మధ్య ఈ వారాహి యాత్ర సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా శనివారం రోజున కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉంది.
వైకాపా పాలకులను గద్దెదింపే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అధికారం పోతుందన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుంది. అందుకోసం వారు ఎంతటికీ అయినా తెగిస్తారు అని వ్యాఖ్యానించారు పవన్. తనను భయపెట్టేకొద్దీ మరింత రాటుదేలుతానని హెచ్చరించారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళలపై చేసిన దాడిని నేను మర్చిపోను అని న్నారు పవన్ కళ్యాణ్.
అలాగే నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారనే సమాచారం ఉంది.. జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించండి ఒక బలమైన కార్యాచరణ లేక అప్పట్లో వెనుకడుగు వేశామని సరైన సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వైకాపాకు ఒక్కటీ దక్కకూడదని స్పష్టం చేశారు. తాను సినీ నటుడిని కాకపోయి ఉంటే.. బలమైన నాయకుడిగా జనంలోకి చొచ్చుకుని వెళ్లేవాడిననన్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.