Pawan Kalyan: ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత స్పీడ్ పెంచారు. ఈ మధ్య ఎక్కువగా ప్రజల్లోనే తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో పవన్ అడుగులు వేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బులతో ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ప్రజవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ అధికారులకు పంపుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో జనసేన గ్రాఫ్ కాస్త పెరినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. పవన్ కల్యాణ్ పోటీపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ పరాజయం పాలయ్యారు. రెండుచోట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది జనసేన వర్గాల్లో సస్పెన్స్ గా మారింది. మళ్లీ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచి వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా.. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలిచి ప్రతీకారం తీర్చుకుంటారా అనేది జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేస్తారా.. లేక ఒకే సీటు నుంచి పోటీ చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆ సారి పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోగా.. తిరుపతి నుంచి గెలిచారు. దీంతో మెగా ఫ్యామిలీకి తిరుపతి సీటు సెంటిమెంట్ గా మారింది. అందువల్ల తిరుపతి నుంచి పోటీ చేస్తే పవన్ గెలుస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందువల్ల తిరుపతి నియోజకవర్గం నుంచి పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో పవన్ చేపట్టనున్న బస్సు యాత్రను కూడా తిరుపతి నుంచే పవన్ స్టార్ట్ చేయనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇక జనసేనాని పోటీపై మరో నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తోంది. పీఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా అయింది. కానీ పవన్ మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని కొంతమంది చెబుతున్నారు. ఎన్నికల ముందు క్లారిటీ ఇచ్చే అవకాశముందని అంటున్నారు.
అయితే పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోకపోవడం వెనుక ఓ వార్త బలంగా వినిపిస్తోంది. ఇప్పుడే పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చే అధికార వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసే అవకాశముంది. ఆ నియెజకవర్గంలోని జనసేన క్యాడర్ ను తమవైపుకు లాగేసుకుని అక్కడ బల పడే అకకాశం ఉంటుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అందుకే వ్యూహత్మకంగా పవన్ వ్యవహరిస్తున్నారని, పోటీ చేసే నియోజకవర్గాన్ని ఇప్పుడే ప్రకటించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు పవన్ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అప్పుడు ప్రకటించడం వల్ల వైసీపీకి కూడా టైమ్ ఉండదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాని పవన్ భావిస్తున్నారు. అందుకోసం వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతుంది.