Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్ కోసమే తగ్గా.. ఏపీ భవిష్యత్ అంటే జనసేన భవిష్యత్ కాదు.. 6 కోట్లమంది భవిష్యత్ అని పవన్ కళ్యాణ్ తణుకు సభలో అన్నారు. పవన్ తన ప్రసంగంలో ఎప్పుడు కూడా తనని ఓ మెట్టు తగ్గించు కుంటారేమో కానీ.. జనసేన కార్యకర్తలను తగ్గించరు. కూటమి నేతలను తగ్గించరు. అందుకే.. జనసేన బలం ఎక్కువగా ఉన్నా.. తక్కువ సీట్లకే పరిమితం అయ్యామని పవన్ అన్నారు. మరోవైపు చంద్రబాబును కూడా పవన్ ప్రశంసించారు. రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని.. ఈ టైంలో అనుభవం ఉన్న నాయకుడు కావాలని పవన అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. చంద్రబాబు అనుభవాన్ని రాష్ట్ర ప్రయోజనాలను వాడుకోవడం కోసమే .. జనసేన తక్కువ సీట్లకు పరిమితమైందని ఆయన చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో రాజకీయంగా జనసేనకు ఓ మంచి ప్రయోజనం ఉంది.
చంద్రబాబును ప్రశంసించడం ద్వారా.. జనసేన పోటీ చేస్తున్న చోట్ల టీడీపీ కార్యకర్తలు బలంగా పని చేయగలుగుతారు. దీనికి తోడు.. పవన్ తనను తాను తక్కువ అంచనా వేసుకొని పార్టీకి నష్టం చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా చాలా మందికి ఉంది. కానీ, పవన్ తణుకు సభలో క్లియర్ గా చెప్పారు. జనసేన బలంగా కంటే తక్కువ సీట్లకే పరిమితం అయ్యామని అన్నారు. 23 సీట్ల మాత్రమే తన బలం కాదని బలంగానే చెప్పారు. దీంతో.. జనసేన కార్యకర్తలు కూడా అసంతృప్తిని వీడే అవకాశం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి కట్టుగా పని చేయాలని కూటమి కార్యకర్తల్లోకి పవన్ మెసేజ్ పంపారు.
నిజంగానే పవన్ తన బలం కంటే తక్కువ సీట్లకు పరిమితం అయ్యారు. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకోసం చాలా ప్రయత్నాలు చేశారు. పొత్తు కుదిరితే అన్ని పార్టీలకూ లాభం జరుగుతుంది. కానీ, పొత్తుకు బీజం పడింది పవన్ కల్యణ్ దగ్గరే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పారు. ఓ రాజకీయ నాయకుడిగా తన పార్టీని బలపరచడం కోసమే ఈ వ్యూహం రచించి ఉండొచ్చు. కానీ, ప్రభుత్వం వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా ఉండటం కోసం ఒకటి కాదు రెండు కాదు వంద అడుగులు వెనక్కి తగ్గారు.
సీట్ల కేటాయింపులో మొదట పవన్ కల్యాణ్ జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. నిజానికి జనసేకు ఉన్న ఓట్ బ్యాంక్కు 24 స్థానాలు తక్కువే. కానీ, బలమైన అభ్యర్థులు లేరని అర్థం చేసుకున్న పవన్ 24 స్థానాలకు అంగీకరించారు. కానీ, ఆ 24 స్థానాల్లో కూడా మరో 3 సీట్లను పవన్ వదులుకున్నారు. దీంతో, జనసేన కార్యకర్తలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవని ఆయన తన పార్టీ శ్రేణులకు నచ్చజెప్పారు. ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పులేదని వివరించారు. సింగిల్ గా పోటీ చేస్తే ఈ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వస్తుందని తెలిపారు. ఒకటి రెండు స్థానాలు దగ్గర పట్టుబడితే కూటమిలో బీటలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అది చివరికి వైసీపీకి లాభం చేస్తుందని కార్యకర్తలకు సూచించారు.