Pawankalyan: తెలుగు రాష్ట్రాల్లో చాలా విషయాల్లో పుకార్లు షికార్లు చేస్తుంటాయని అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా రాజకీయాలతో ముడిపడిన విషయాలు మరియు సినిమాలతో ముడిపడిన విషయాలు అయితే మరీ ఎక్కువగా వస్తుంటాయి. అందుకే చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు తమ మీద వచ్చే పుకార్ల మీద స్పందించరు.
తమ మీద వచ్చే ప్రతి పుకారు మీద స్పందించుకుంటే కూర్చుంటే వాళ్లు వాళ్ల కెరీర్ మీద దృష్టి పెట్టడానికి కూడా సమయం ఉండకపోవచ్చు. అయితే తెలుగు జనాల్లో బాగా పాపులర్ అయిన ఓ పుకారు.. పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించాడనే పుకారు ఎన్నో సంవత్సరాలుగా షికారు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు దీనిని రాజకీయ నేతలు కూడా పవన్ ని విమర్శించడానికి వాడుతూ ఉండటం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఈ పుకార్ల మీద స్పందించలేదు. అయితే తాజాగా పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ ఈ పుకార్ల మీద క్లారిటీ ఇచ్చాడు. జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూలో పరిటాల శ్రీరామ్.. పవన్ కళ్యాణ్ విషయంలో పరిటాల రవి అలా చేశారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమిచ్చారు.
ఓ నాయకుడిగా ఎదిగే సమయంలో ఇలాంటి పుకార్లు వస్తుండటం సాధారణమే అని, అయితే పుకార్లలో కొంత నిజం ఉంటే స్పందించవచ్చని కానీ అసలు నిజం లేని దానిపై ఎలా స్పందించాలని పరిటాల శ్రీరామ్ అన్నారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణే అన్న శ్రీరామ్.. పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపించడానికే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసి ఉంటారని అన్నారు. అయతే ఇలాంటి విషయాలను పవన్ కళ్యాణ్ ఎంతో బాగా అర్థం చేసుకుంటారని.. పవన్ తో పరిటాల కుటుంబానికి మంచి అనుబంధం ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు.