Posani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, డైరెక్టర్ గా, స్టోరీ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాల వరకే కాకుండా అప్పుడప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో పోసాని చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది.
పోసాని కృష్ణమురళి రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా.. వైసీపీకి అనుకూలంగా ఉంటూ, ప్రత్యర్థి పార్టీల మీద, ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతల మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
దీనిపై జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకపోవడంతో.. జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. జనసేన నాయకులు యందం ఇందిరా ఈ కేసు మీద కోర్టులో తన వాదనలు వినిపించారు.
కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. పోసాని కృష్ణ మురళి మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355, 500, 504, 506, 507 మరియు 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీసులు. మరి ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.