Raghurama Krishnamraju: టికెట్లు ప్రకటన పూర్తి అయిన తర్వాత కూడా నర్సారావు పేట ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఇంకా టికెట్ వస్తుందని నమ్మకం పోలేదు. ఆయన ఇంకా.. కూటమిలో ఏదో ఒక పార్టీతరుఫున పోటీ చేస్తాననే చెబుతున్నారు. దానికి ఆయన దగ్గర ఓ లాజిక్ కూడా ఉంది. జగన్ పై తాను ఒంటరిగా పోటీ చేస్తున్నానని ఆయన చెబుతున్నారు. తన పోరాటంలో ఇంతవరకూ ఓడిపోలేదని కూడా అంటున్నారు. సీఎం జగన్ తనను చంపాలని అనుకున్నారు. చంపలేకపోయారు. ఎంపీగా డిస్ క్వాలిఫై చేయాలనుకున్నారు.. కానీ.. చేయలేకపోయారని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ సీబీఐ కోర్టులో మూడు వేల సార్లు వాయిదాలు కోరారని గుర్తు చేశారు. అన్ని సార్లు వాయిదా కోరడం చట్ట రీత్య నేరమని అన్నారు. జగన్ కేసుల్లో ఆయన రెండు పిటిషన్లు వేశారనిన చెబుతున్నారు. ఆయన కేసులను త్వరగా విచారించాలని ఓ పిటిషన్. ఇన్నాళ్లు న్యాయస్థానానికి వెళ్లకపోవడంతో బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఆ రెండు పిటిషన్లు కూడా ఏప్రిల్ 1న విచారణ కు వస్తాయని చెప్పారు. మూడు వేల సార్లు విచారణ వాయిదాలు ఇవ్వకూడదని చట్టంలో ఉందని ఆయన చెప్పారు. కాబట్టి ఈ పిటిషన్లలో కూడా తానే గెలుస్తానని అన్నారు. ఇన్ని విషయాల్లో గెలిచిన ఆయన టికెట్ విషయంలో గెలవకుండా ఉంటానా? అనేది ఆయన లాజిక్. టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించవచ్చు కానీ.. చివరికి తానే విజయం సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు.
కూటమి నేతలు ఆయనకు అన్యాయం చేయరని చెబుతున్నారు. చంద్రబాబు, మోడీ, పవన్ పై పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. జగన్ తనను జైల్లో పెట్టినపుడు చంద్రబాబు చాలా సాయం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి టికెట్ విషయంలో అన్యాయం చేస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. అంతేకాదు.. జగన్ తనను చంపాలని ప్రయత్నిస్తే కేంద్రమే తనకు అండగా ఉందని గుర్తు చేశారు. అలాంటి కేంద్ర పెద్దలు తనకు న్యాయం చేయకుండా ఉంటారా? అని అంటున్నారు. టికెట్ రావడం నాలుగు రోజులు ఆలస్యం కావొచ్చు కానీ.. కూటమి పెద్దలు పునరాలోచిస్తారని తాను అనుకుంటున్నానని అన్నారు. టికెట్ వస్తుందనే నమ్మకం రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఉందని చెప్పారు. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? టికెట్ వస్తుందనే నమ్మకంతో చెబుతున్నారో కానీ.. పోటీపై మాత్రం రఘురామకృష్ణం రాజు నమ్మకాన్ని వదులుకోలేదు. టీడీపీ కూడా నాలుగో జాబితా విడుదల చేసింది. అయినా.. నర్సాపురం టికెట్ బీజేపీ చేతిలో ఉంది. చంద్రబాబు లేదా పవన్ ఆ విషయంలో చేసేదేమీ లేదు. కానీ.. రఘురామకృష్ణం రాజు మాత్రం కూటమి అధినేతలందరిపై భారం వేసేశారు. కానీ, నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రచారం కూడా చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. కానీ, రఘురామకృష్ణం రాజు మాత్రం టికెట్ దక్కుతుందనే నమ్మకాన్ని మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు.
ఆ నమ్మకంతోనే బీజేపీ, జనసేన, బీజేపీలో కూటమి కట్టడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. నాలుగేళ్ల పైనుంచి వైసీపీ, జగన్కు చుక్కలు చూపిస్తూ వచ్చిన ఆయనకు బీజేపీ టికెట్పై ఆశలు అడియాశలయ్యాయి. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఏ రేంజ్లో ప్రోత్సహించారో.. ఎప్పుడెలా ఆకాశానికెత్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాస్తవానికి వైసీపీలో రెబల్ అవతారమెత్తాక.. ఆయన నరసాపురంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో పాపులర్ అయ్యారు. ఢిల్లీలో రచ్చబండ అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన హడావుడి… ఆ క్రమంలో ఆయన అరెస్ట్ అవ్వడం… అరెస్ట్ సమయంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని ఆయన కోర్టు కెక్కడం వంటి ఎపిసోడ్లతో ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. అలా అందరికీ తెలిసిన నాయకుడ్ని కాదని.. బీజేపీ శ్రీనివాసవర్మకి నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. రఘురామకృష్ణం రాజుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా.. ఆయన మాత్రం వైసీపీ అధినేత జగన్నే తప్పుబడుతున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో చక్రం తిప్పించి తనకు టికెట్ లేకుండా చేశారని ఆరపించారు.