RK Roja: మంత్రి ఆర్.కె. రోజా సినీనటిగా చిరంజీవితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది. అదేవిధంగా నాగబాబుతో కలిసి జబర్దస్త్ ప్రోగ్రాం మరియు ఎన్నో టీవీ ప్రోగ్రాముల్లో మనకూ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ విషయానికి వస్తే మాత్రం రాజకీయంగా ఎదో ఒకటి అంటూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి విషయమే మరోసారి ఆర్. కె. రోజాను వార్తల్లో నిలబెట్టింది.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించాక మొదటి నుంచి అందరూ ఏదో ఒకటి అనడం పరిపాటి అయిపోయింది. ఇలా చాలా మంది తాము ప్రజలకు తెలియకున్నా పవన్ కల్యాణ్ ను ఏదో ఒకటి తిట్టి నోరు పారేసుకుని వార్తల్లో కెక్కిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వంపై, మూడు రాజధానుల అంశంపై తనదైన శైలిలో విమర్శలు, ప్రశ్నలు సంధించారు. ఇవి ఏవీ పట్టని వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వాన్నే నిలదీస్తావా ? మా నాయకుడినే అంటావా అని నానా హంగామా చేస్తున్నారు. వాళ్ళతో కంటెంట్ లేకున్నా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు.
మంత్రి ఆర్.కే. రోజా పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ “పవన్ కళ్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని, టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తు రాలేదా..? రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు ఊరుకోరని వ్యాఖ్యలు చేశారు. ఏదో పార్టీ పెట్టేసి 6 నెలలు రాజకీయాలు, 6 నెలలు సినిమాలు చేసుకునే పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు మనకు అవసరమా ? అని ప్రశ్నించారు. ఇన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని ఘాటైన విమర్శలు చేశారు.
ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని ఆర్. కె. రోజా మంత్రి పదవి వచ్చేసరికి మంత్రి పదవిని కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు తెలుగుదేశం నాయకులను, జనసేన అధ్యక్షుడిని వీలున్నప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. ఎంతగా విమర్శిస్తే అంతగా మంత్రి పదవికి ఢోకా ఉండదని వైసీపీ మంత్రులకు బాగా తెలిసినట్టుంది. ఏదీ ఏమైనా మంత్రి రోజా తన నియోజకవర్గంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అభిమానులు ఉన్నారనే విషయం మరచిపోకూడదు.