Bhupalapally: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే చాలా వరకు ఈ సెల్ ఫోన్లో భార్యాభర్తల మధ్య తగాదాలకు కారణం అవుతున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఈ సెల్ ఫోన్ లు అనేక రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అనుమానాలు అపార్థులు పండంటి కాపురంలో చిచ్చులు పెడుతున్నాయి. తాజాగా కూడా ఒక సెల్ ఫోన్ ఒక వివాహిత ప్రాణాలను బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మూడెత్తుల రమేష్తో పెద్ద పల్లి జిల్లా మంథని మండలం వెక్లాస్పూర్కు చెందిన ఎర్రయ్య తన కూతురు లక్ష్మి అనే 30 ఏళ్ళ మహిళకి 2008 లో పెళ్లి అయ్యింది. వీరికి కొడుకు, కూతురు కూడా ఉన్నారు.
పెళ్ళైన తర్వాత కొంతకాలం పాటు దాంపత్యం సజావుగా సాగిపోతున్న సమయంలో సెల్ ఫోన్ కాపురంలో చిచ్చు పెట్టింది. తరచూ ఆమె ఫోనులో ఎవ్వరితోనే మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం మొదలైంది. అదే విషయం పై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వేధింపులు తాళలేక లక్ష్మి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఈ విషయంపై ఇటీవల పెద్దమనుషుల మధ్య పంచాయితీ జరిగింది. భార్యా భర్తల మధ్య రాజీ కుదిర్చారు. తిరిగి అత్తగారింటికి మంగళవారం ఆమె చేరుకుంది.
అదే రోజు సుదర్శన్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం తెల్లవారి చూసేసరికి ఇంట్లో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు పుట్ట కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గొంతు నులిమి చంపేసినట్లు చెబుతున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన చెల్లి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, భర్త రమేష్, ఆడబిడ్డ వేధించారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తునామని సీఐ రంజిత్, ఏఎస్సై కుమారస్వామి తెలిపారు.