Sania Mirza: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన రిటైర్మెంట్పై మరో కొత్త ప్రకటన చేసింది. గతేడాదే ఆమె ఆట నుంచి తప్పుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే అప్పట్లో సానియా మనసు మార్చుకుంది. తాజాగా తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో ఎట్టకేలకు రివీల్ చేసింది. తాను టెన్నిస్ మైదానానికి గుడ్ బై చెప్పడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని ప్రకటించింది.
హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటిస్తుందని ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను ఇప్పుడు నిజం చేసింది. ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పదేళ్లుగా దుబాయ్లో ఉంటున్న సానియా ఎమిరేట్స్లోనే తాను ఆడుతున్న క్రీడకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. దుబాయ్లో తనకున్నభారీ అభిమానుల సంఖ్య మధ్య తన రిటైర్మెంట్ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యింది.
36 ఏళ్ల సానియా మీర్జా కొత్త ఏడాదిలో ముందుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడనుంది. అందులో కజకిస్థాన్ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్స్లామ్ కానుంది. ఆ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్లో ఆమె కెరీర్ చిట్టచివరి టోర్నీ ఆడనుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ ఆడి ఆటకు గుడ్బై చెప్పాలనుకున్న సానియాకు గాయం అడ్డంకిగా మారింది. అందుకే రిటైర్మెంట్ను వాయిదా వేసుకుంది.
20 ఏళ్ల పాటు టెన్నిస్ ఆడిన సానియా
2003లో సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇరవై ఏళ్లుగా తన శరీరాన్ని ఆటకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నానని సానియా వెల్లడించింది. 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకుంది. 2018లో సానియా మీర్జాకు ఇజాన్ పుట్టాడు. ప్రస్తుతం నాలుగేళ్ల కొడుకుతో దుబాయ్లో ఉంటోంది.అక్కడే టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.