Sharmila: మునుగోడు ఉపఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ఆ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ మునుగోడు ఉపఎన్నిక కాక పుట్టిస్తోంది. తెలంగాణలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడులో గెలిపొందేందుకు పార్టీలన్నీ వ్యూహలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. ఈ నెల 21న మునుగోడులో జరిగే బహిరంగసభలో అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.
నవంబర్ లో లేదా డిసెంబర్ లో మునుగోడు ఉపఎ న్నికకు పోలింగ్ జరిగే అవకాశముంది. దీంతో ఇంకా కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ఉపఎన్నికకు సిద్దమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. ఆయనకే కేసీఆర్ టికెట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పేరుతో పాటు పల్లె రవికుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనేది తెలియాల్సి ఉంది.
ఇక మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీలైన సీపీఎం, టీడీపీ, షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. మునుగోడులో సీపీఎంకు బాగా బలం ఉంది. సీపీఎం అక్కడ ఆరుసార్లు గెలిచింది. దీంతో సీపీఎం ఓటర్లు కూడా కీలకంగా మారనున్నారు. బీజేపీని వ్యతిరేకించే వారికి తాము మద్దతు ఇస్తామని సీపీఎం చెబుతోంది. దీంతో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మునుగోడు ఉపఎన్నికలో వైఎస్సార్ టీపీ కూడా పోటీ చేసే అవకాశముంది. వైఎస్సార్ టీపీ తరపున మునుగోడులో అభ్యర్థిని బరిలోకి దింపాలని షర్మిల భావిస్తున్నారు.
నల్లొండ జిల్లాలో వైఎస్సార్ అభిమానులు చాలామంది ఉన్నారు. ఇక వైఎస్సార్ టీపీ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. దీంతో వైఎస్సార్ టీపీ తరపున మనుగోడు ఉపఎన్నికల్లో అభ్యర్థిని రంగంలోకి దింపాలని షర్మిల భావిస్తున్నారు. తమ పార్టీ సత్తా ఏంటో చూపించాలనే భావనలో షర్మిల ఉన్నారు. ఇప్పటికే పాదయాత్రతో తెలంగాణలో షర్మిల తన ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి వైఎస్సార్ టీపీ కూడా రేసులో ఉందనే సంకేతాన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలకు పంపించాలనే షర్మిల భావిస్తున్నారు. ప్రధాన పార్టీలు షర్మిల పార్టీని గుర్తించడం లేదు. ఆమె పార్టీ పట్ల చిన్నచూపు చూస్తున్నారు.
దీంతో మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి వైఎస్సార్ టీపీ సత్తా చూపించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. బలమైన నేత కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అటు టీడీపీ కూడా మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని సూచించారు.