Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఇక వారాహి యాత్ర మొదలుపెట్టిన తర్వాత సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పవను ముందస్తుగానే పొత్తుల విషయంలో ఎన్ని సీట్లు, ఏయే సీట్లు అడగాలనే దాని పై ఇప్పుడే కసరత్తు పూర్తి చేస్తున్నారు. తన పార్టీ తరఫున సర్వేలు చేసిన సంస్థలతో భేటీ అవుతున్నారు.
పొత్తుల సంగతి పూర్తిగా తనకు వదిలేయమని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పేశారు. అయితే తెలుగుదేశంతో పొత్తు విషయం డిసైడ్ అయిన పవన్ కల్యాణ్ ఎన్నిఏయే సీట్లు అడగాలో డిసైడ్ చేసుకునే ముందు ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ అంశాలు ఏవి అన్న వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో బిఎస్పీతో పొత్తు పెట్టుకున్న జనసేన రాష్ట్రవ్యాప్తంగా 138 సీట్లలో పోటీచేసింది. కేవలం 16 సీట్లలో మాత్రమే వారికి డిపాజిట్లు లభించాయి.
ఒకే ఒక్క సీటు రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆయన తర్వాత వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. రాజోలు విజయాన్ని జనసేన పార్టీ ఖాతాలో వేసుకోవడానికి వీల్లేదు. వర ప్రసాద్ స్థానికంగా చాలా బలమైన నాయకుడు అనే ఉద్దేశంతోనే జనసేన పిలిచి చేర్చుకుంది. ఆయన గెలిచి, పార్టీ చతికిలపడ్డాక ఆయన బయటకు వెళ్లారు. రెండు చోట్ల పోటీచేసిన పవన్ రెండూ చోట్ల కూడా ఓడిపోయారు.
భీమవరంలో రెండవ స్థానం, గాజువాకలో మూడవ స్థానం ప్లేస్ లభించాయి. కాబట్టి ఈసారి మళ్లీ తాను రెండు చోట్ల పోటీచేస్తానని పవన్ అడిగితే చంద్రబాబు ఒప్పుకోకపోవచ్చు. పైగా అది పవన్ కు కూడా పరువునష్టంగా ఉంటుంది. తన గెలుపుమీద కూడా నమ్మకం లేని నాయకుడిగా ఆయన విమర్శలు భరించాలి డిపాజిట్లు సాధించిన మిగిలిన 13 మందిలో ఒక్కరు మాత్రం కృష్ణా జిల్లా కాగా, మిగిలిన డజను మంది ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే. ఈ పాయింట్లను పవన్ కల్యాణ్ మదిలో ఉంచుకోవాలి.